హైదరాబాద్: భారత టెన్నిస్ ప్లేయర్ సోమ్దేవ్ దేవ్వర్మన్ ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత అత్యుత్తమ సింగిల్స్ ప్లేయర్స్లో ఒకడైన దేవ్వర్మన్ సడెన్గా రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
టెన్నిస్ సింగిల్స్ విభాగంలో సోమ్దేవ్ భారత టెన్నిస్కు పలు విజయాలనందించాడు.
ఇంతకుముందే చెన్నై ఓపెన్లో ఆడటం లేదని చెప్పి ఆశ్చర్యపరచిన సోమ్దేవ్ జనవరి 1వ తేదీన అభిమానులకు షాకిచ్చాడు. 2017ను కొత్తగా ప్రారంభిస్తున్నాను. ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించాను. ఇన్నేళ్లుగా నాపై ఆదరాభిమానాలు చూపించిన వారికి కృతజ్ఞతలు అని సోమ్దేవ్ ట్వీట్ చేశాడు.
2008లో ప్రొఫెషనల్ ప్లేయర్గా మారిన సోమ్దేవ్ భారత్ తరఫున డేవిస్ కప్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత పలు టోర్నీలో అద్భుతంగా రాణించి భారత్కు విజయాలను తెచ్చిపెట్టాడు. 2009 చెన్నై ఓపెన్, 2011 దక్షిణాఫ్రికా ఓపెన్ సిరీస్ల్లో సింగిల్స్ విభాగంలో ఏటీపీ టైటిల్కు దగ్గరకు వచ్చిన ఒకే ఒక భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు సోమ్దేవ్.

2010లో ఇండియా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్కు క్వాలిఫై అవడంలో సోమ్దేవ్ కీలకపాత్ర పోషించాడు. 2011లో సోమ్దేవ్కు అర్జున అవార్డు దక్కింది. 2011లో కెరీర్ బెస్ట్ 62వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించాడు. లియాండర్ పేస్, మహేష్ భూపతి తర్వాత ఆ స్థాయిలో ఇండియన్ టెన్నిస్లో ఎదుగుతాడని అందరూ భావించారు.
అయితే గాయలు అతడి కెరీర్ను దెబ్బతీశాయి. రెండేళ్ల కిందట ఎస్ఎస్ఏ ఎఫ్10 ఫ్యూచర్స్లో జరిగిన మ్యాచ్లో సెబాస్టియన్ ఫెన్సిలో చేతిలో 3-6, 2-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత నుంచి సోమ్దేవ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం సోమ్దేవ్ 740వ ర్యాంకుకు పతనమయ్యాడు.