న్యూఢిల్లీ/లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం పట్ల యావత్ భారతదేశం గర్వపడుతుండగా.. బిబిసి ఛానల్ మాత్రం డబుల్స్లో గెలిచిన సానియా పేరును విస్మరించింది. సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హెంగిస్ జతగా టైటిల్ కైవసం చేసుకుంది.

సానియా జోడీ విజయాన్ని భారత మీడియా కొనియాడగా.. బిబిసి ఇండియా మాత్రం భిన్నంగా స్పందించింది. సానియా పేరును ప్రస్తావించకుండా 'హెంగిస్ వింబుల్డన్ డబుల్స్ ఫైనల్లో విజయం సాధించింది' అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. దీనిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అసహనం వ్యక్తం చేశారు.
బిబిసి తప్పిదంపై స్పందిస్తూ 'బిబిసి ఇండియా.. సానియా కూడా గెలిచినట్టే కదా!' అని ట్వీట్ చేశారు. బిబిసి ఇండియా దీనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, మంత్రి స్మతీ ఇరానీ ట్వీట్కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.
ఇది ఇలా ఉండగా, బిబిసి ఇండియా తన ట్వీట్ను టైమ్లైన్ నుంచి తొలగించింది. ఆ తర్వాత మళ్లీ ముందుగా చేసిన ట్వీట్కు క్షమాపణ చెబుతూ.. 'భారతదేశానికి చెందిన సానియా మీర్జా వింబుల్డ్ డబుల్స్ టైటిల్ను మార్టినా హెంగిస్తో కైవసం చేసుకున్నారు'ని ట్వీట్ చేసింది.
వింబుల్డన్ విజేతలకు సచిన్ అభినందనలు
వింబుల్డన్లో విజయాలు సాధించిన భారత క్రీడాకారులను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. లియాండర్ పేస్, సానియా మీర్జా, సుమిత్ నాగల్లకు ట్విట్టర్ ద్వారా సచిన్ తన అభినందనలు తెలిపాడు. సానియా మీర్జా, లియాండర్ పేస్ ఇద్దరూ కూడా మార్టినా హింగిస్తోనే జగకట్టి వింబుల్డన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లు సాధించారు.
బాలుర డబుల్స్ ట్రోఫీ గెలచుకున్న తర్వాత జూనియర్ గ్రాండ్ శ్లామ్ గెలుచుకున్న ఆరో భారతీయుడిగా సుమిత్ నాగల్ చరిత్ర సృష్టించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ఈ ముగ్గురినీ అభినందించాడు. 'మీరు భారత యువతకు అద్భుతమైన మార్గదర్శకులుగా నిలిచారు' అని ప్రశంసించాడు. సానియా మీర్జా ఇలాగే కష్టపడి మరిన్ని ట్రోఫీలు గెలవాలని అభిలషించాడు.
సుమిత్ నాగల్ సంచలనం
వింబుల్డన్ జూనియర్ విభాగంలోనూ భారత్కు ఓ టైటిల్ దక్కింది. బాలుర డబుల్స్ విభాగంలో హర్యానాకు చెందిన సుమీత్ నాగల్.. నామ్ హోంగ్ లీ (వియత్నాం)జోడీగా ఛాంపియన్గా నిలిచి భారత్ నుంచి గ్రాండ్స్లామ్ టోర్నీలో టైటిల్ గెలిచిన ఆరో జూనియర్ ఆటగాడిగా నిలిచాడు.