హైదరాబాద్: తన సోదరిని చంపిన హంతకుడి విడుదల వార్త తెలిసి వణికిపోయినట్లు అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అన్నారు. దీంతోనే తాను సిలికాన్ వ్యాలీ క్లాసిక్ టోర్నీలో ఓటమి చెందానని సెరెనా చెప్పుకొచ్చారు. 23 గ్రాండ్ స్లామ్ల విజేత అయిన సెరెనా ఈ టోర్నీలో సెరెనా ఊహించని విధంగా తొలి రౌండ్లోనే అత్యంత దారుణంగా ఓడిపోయింది.
బ్రిటన్ క్రీడాకారిణి జొహన్నా కొంటా చేతిలో 6-1, 6-0తో ఓటమిపాలైంది. ఈ ఓటమి సెరెనా కెరీర్లోనే అత్యంత ఘోర పరాజయం. తాజాగా టైమ్స్ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఓటమిపై సెరెనా స్పందించింది. "నా సోదరిని చంపిన హంతకుడు పేరోల్ మీద విడుదలైనట్లు వచ్చిన స్క్రోల్స్ను ఆ మ్యాచ్కు పది నిమిషాల ముందే ఇన్స్టాగ్రామ్లో చూశాను" అని తెలిపింది.
"దీంతో భయాన్ని నా మనసు నుంచి తొలగించలేకపోయాను. అది నాకు చాలా కష్టం. నేనెప్పుడు నా సోదరి పిల్లల గురించే ఆలోచిస్తాను. వారంటే నాకంత ఇష్టం. ఆమె లేకపోవడం తట్టుకోలేకపోతున్నాను" అని సెరెనా ఆవేదన వ్యక్తం చేసింది. సెరెనా సోదరి ఎటుండే ప్రైస్(31)ని 2003లో హంతకుడు రొబెర్ట్ మ్యాక్స్ఫీల్డ్ లాస్ ఎంజెల్స్లో తుపాకీతో కాల్చి చంపాడు.
దీంతో నిందితుడు రోబెర్ట్ మ్యాక్స్ఫీల్డ్కు లాస్ ఏంజెల్స్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రైస్ మరణించే సమయానికి ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి వయసు 11, 9, 5. అప్పటి నుంచి ఆ ముగ్గురి పిల్లలను సెరెనా పెంచుతున్న సంగతి తెలిసిందే.