న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదరైంది. తన శిక్షణకు ఖర్చు చేసిన సొమ్మును తన తండ్రి సిజి కృష్ణ భూపతికి తిరిగి ఇచ్చేశానని చెబుతూ దానిపై తనకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. సొమ్ముపై రూ. 28.5 లక్షల పన్నును మినహాయించడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా ఆ పన్ను మినహాయింపునకు అంగీకరించలేదు. మహేష్ భూపతి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సిజి కృష్ణమూర్తికి చెల్లించిన సొమ్ముపై 28.5 లక్షల రూపాయల పన్ను చెల్లించాలని ఆదాయం పన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక హైకోర్టు సమర్థించింది. 1989 - 90 నుంచి 1993 - 94లో తన తండ్రి తనకు శిక్షణ ఇప్పించేందుకు డబ్పులు ఖర్చు చేశారని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశానని, దానిపై పన్ను మినహాయించాలని మహేష్ భూపతి అన్నారు. పన్ను ఎగ్గొట్టడానికి మాత్రమే తండ్రీ కొడుకులు ఒప్పందం చేసుకున్నారని, అది హిందూ చట్టానికి విరుద్ధమని ఐటి శాఖ చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది.