హైదరాబాద్: ఇటీవల కాలంలో బాలీవుడ్లో పలువురు క్రీడాకారుల జీవిత కథలను బయోపిక్లుగా తెరకెక్కించిన నేపథ్యంలో హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితంపై సినిమా రూపొందవచ్చనే ఊహాగానాలు గతంలో వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తన బోయోపిక్పై సానియా మిర్జా క్లారిటీ ఇచ్చింది. తన జీవిత కథ తెరకెక్కే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. తన బయోపిక్ను తీయడం సాధ్యం కాకపోవచ్చని సానియా తాజాగా పేర్కొంది. ఈ మేరకు జాతీయ దినపత్రిక హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్యూలో సానియా మిర్జా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఏడ్చాను, నోట మాట రాలేదు: ఆ ఓటమిపై సానియా
తన జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించడానికి పలువురు నిర్మాతలు తనను కలిసిన మాట నిజమేనని సానియా పేర్కొంది. అయితే వాటిని తాను సున్నితంగా తరిస్కరించినట్లు ఆమె వెల్లడించింది. తన పర్సనల్ లైఫ్ని పబ్లిక్ లో పెట్టడం కష్టం అని చెప్పుకొచ్చింది.
'నా జీవిత కథను తీయడానికి కొంతమంది నన్ను కలిసిన మాట వాస్తవమే. వారికి నేను ఒకటే చెప్పా. బయోపిక్ తీయాలంటే నా జీవితం గురించి ప్రతీ విషయాన్ని బయోపిక్లో చూపించాలి. అది కొంచెం కష్టమే. అందుచేత నా బయోపిక్పై ఆసక్తిగా లేను' అని సానియా పేర్కొంది.
ఈ ఏడాది మహిళల డబుల్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్ను నంబర్ వన్ గా ముగించిన సానియా.. తాను ఎదుర్కొన్న పరాజయాలను మరింత బలంగా తయారయ్యేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. ఒలింపిక్స్లో పతకం సాధించే అవకాశం తన వరకూ వచ్చిన దాన్ని అందుకోలేకపోయామనే బాధ ఉందని సానియా పేర్కొంది.
టెన్నిస్కు తన జీవితాన్ని సానియా మిర్జా అంకితం చేసినా ఆమె పేరుని కొందరు తరచూ వివాదాల్లోకి లాగారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో పెళ్లి, దేశభక్తి, మత విశ్వాసాలను ప్రస్తావిస్తూ సానియాపై విమర్శలు కూడా చేశారు. అంతేకాదు ఆమెపై కోర్టులో పిటిషన్లు కూడా వేశారు.
ఇవన్నీ సానియాకు చికాకుని కూడా తెప్పించాయి. దీనికి తోడు పర్సనల్ లైఫ్ పబ్లిక్ కావడం ఇష్టం లేదని ఏమనుకుందో ఏమో తెలియదు గానీ బయోపిక్కు దూరంగా ఉండాలని సానియా మిర్జా నిర్ణయం తీసుకుంది.