హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన సానియా మిర్జా, అనవసరంగా ఈ విషయాన్ని రచ్చ చేశారంటూ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం సానియా మిర్జాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించి కోటి రూపాయలను అందించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు.

దీంతో ఆ పారితోషికం మొత్తంపై సర్వీస్ ట్యాక్స్ కింద 14.5 శాతం డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ మేరకు ఆమెకు సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. సానియా మిర్జా తరుపున ఆమె ప్రతినిధి హాజరై డాక్యుమెంట్లను సమర్పించారు.
అయితే ఇదే సమయంలో ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా-స్ట్రైకోవా (చెక్ రిపబ్లిక్) జోడీ 6-4, 6-3తో డబ్రౌస్కి (కెనడా)-జురాక్ (క్రొయేషియా) జంటను ఓడించింది.
దీనిపై సానియా మిర్జా 'ఖతార్ ఈవెంట్లో నేను సెమీఫైనల్ చేరాను. కానీ ఈ విషయాన్ని మీడియాలోని కొందరు పట్టించుకోలేదు. అదే, నేను పన్ను ఎగ్గొట్టానన్న విషయంపై వందలకొద్దీ ఆర్టికల్స్ రాశారు' అని ప్రస్తుతం దోహాలో ఉన్న సానియా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.