హైదరాబాద్: తాను సాధించిన యుఎస్ ఓపెన్ టైటిల్ను దేశ ప్రజలకు అంకితం చేస్తున్నానని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చెప్పారు. హైదరాబాద్కు చేరుకున్న సానియా మిర్జాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె కుటుంబ సభ్యులు, మిత్రులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సానియా మిర్జా మాట్లాడుతూ యుఎస్ ఓపెన్ గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది తాను అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నానని తెలిపారు. ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్స్లో టాప్ సీడ్ సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడీ 6-3, 6-4 తేడాతో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్టేలియా) - యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం తనపై వస్తున్న విమర్శలకు సానియా మిర్జా సమాధానమిచ్చారు. తనను విమర్శించే వాళ్లు ఏం అంటారన్న విషయం తనకు అవసరం లేదని, తాను కేవలం ఆటపై మాత్రమే దృష్టిని సారిస్తానని స్పష్టం చేసింది.

"నాకు తెలుసు. వాళ్ల దినపత్రికలు అమ్ముకోవడానికి, టీఆర్పీ రేటింగులు పెరగడానికి, నా కెరీర్ మొత్తం నేను సహకరిస్తూనే ఉన్నాను. విషయం లేకుండానే నాకు పబ్లిసిటీ ఇస్తూ, ప్రజలకు దగ్గరగా ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు. నేను టెన్నిస్ మాత్రమే ఆడతాను. గెలవడానికి ప్రయత్నిస్తాను. నా కోసం, నా దేశం కోసం ఆడతాను. నాపై విమర్శలకు కేవలం రాకెట్ తోనే సమాధానం ఇస్తా. అదే నాకు ఇష్టం" అని అన్నారు.
కాగా, సానియా మిర్జాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును బహూకరించడంపై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.