
హైదరాబాద్: పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని ఇంట్లోనే ఉండి జరుపుకున్నానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపారు. సోమవారం రంజాన్ను పురస్కరించుకుని తన కొడుకుతో దిగిన ఫొటోను సానియా ట్విట్టర్లో పోస్టు చేసారు. తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్ వైపు ప్రేమగా చూస్తున్న ఫొటో అది. 'రంజాన్ ఈద్ పండగ వేడుకలు' అంటూ క్యాప్షన్ జత చేశారు. కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగను సానియా ఇంట్లోనే జరుపుకున్నారు.
'లాక్డౌన్ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండగ జరుపుకుంటున్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలి. ఈ పండగ ఇంతకుముందులా లేదు. అవసరాల్లో ఉన్నవాళ్ల గురించి, కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వాళ్ల గురించి ఆలోచించాలి. ఆ పోరాట యోధులకు ధన్యవాదాలు తెలపాలి. దూరంగా ఉంటూనే మనమందరం ఒక్కటిగా మారి మెరుగైన ప్రపంచాన్ని కోరుకుందాం' అని సానియా మీర్జా మరో ట్వీట్లో పేర్కొన్నారు.
రంజాన్ సందర్భంగా ముస్లిం సాంప్రదాయ వేషాధారణలో తెల్లని కుర్తాను ధరించిన సానియా మీర్జా ఎంతో అందంగా ఉన్నారు. సానియా ముద్దుల కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్ కూడా సంప్రదాయ దుస్తుల్లో క్యూట్గా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అయింది. 'చాలా అందంగా కనిపిస్తున్నారు సానియా' అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సానియా.. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తారన్న విషయం తెలిసిందే.
లాక్డౌన్ నేపథ్యంలో సానియా, ఇజాన్ హైదరాబాద్లోని ఉండగా.. పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్మన్, భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్లోని సియాల్కోట్లో ఉన్నారు. దీంతో సానియా తన కుటుంబం విషయంలో ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతూ షోయబ్ అక్కడే చిక్కుకున్నాడు. నేను లాక్డౌన్ ముందు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చా. దీంతో ఇజాన్ను చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇజాన్ తన తండ్రిని ఎప్పుడు చూస్తాడో తెలియదు' అని సానియా అన్నారు.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్లో సాంప్రదాయ పద్దతిలో షోయబ్ మాలిక్ను సానియా వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతనే ఇజాన్ మీర్జా మాలిక్. ఇటీవల ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా సానియా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.