
లండన్: వింబుల్డన్ 2021లో భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా దూసుకుపోతోంది. వరుసగా రెండు విజయాలు అందుకుంది. వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, సానియా మీర్జా జోడి తొలి రౌండ్లో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత దేశానికే చెందిన రామ్కుమార్ రామనాథన్, అంకితా రైనాతో పోటీపడి గెలుపొందారు. గంటా 9 నిమిషాల పాటు సాగిన పోరులో ఇరు పక్షాలు హోరాహోరీగా తలపడ్డా.. చివరికి రోహన్, సానియా 6-2, 7-6 తేడాతో రామనాథన్, అంకితాలను ఓడించారు.
గ్రాండ్స్లామ్ చరిత్రలోనే భారత దేశానికి చెందిన ప్లేయర్లు (రోహన్ బోపన్న, సానియా మీర్జా-రామ్కుమార్ రామనాథన్, అంకితా రైనా) తలపడం ఇదే తొలిసారి కావడం విశేషం. రెండో రౌండ్లో ఫ్రెంచ్ జోడి నికోలస్ మహత్, క్రిస్టినా లాడెనోవిక్తో బోపన్న-సానియా జోడి తలపడనుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో పోటీపడనున్న రామ్కుమార్.. 21 ప్రయత్నాల తర్వాత వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
నాలుగేళ్ల తర్వాత కోర్టులోకి అడుగుపెట్టిన సానియా మీర్జా.. ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో వరుసగా రెండో విజయం సాధించడం విశేషం. గురువారం మహిళల డబుల్స్ విభాగంలోనూ అమెరికా పార్ట్నర్ బెతానీ మాటెక్సాండ్స్తో కలిసి అలెక్సా గువారచి, డెసిరే క్రాజిక్ను 7-5, 6-3 తేడోతో ఓడించింది. ఈ క్రమంలోనే అక్కడ కూడా రెండో రౌండ్కు సానియా అర్హత సాధించింది. మరోవైపు ఈ నెలాఖరులో జరిగే టోక్యో ఒలింపిక్స్ 2021కు అర్హత సాధించిన సానియా.. అంకితా రైనాతో కలిసి పాల్గొననుండటం గమనార్హం.
2018లో ఇజాన్కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి సెకండ్ ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించింది సానియా మీర్జా. కరోనా కారణంగా ఎక్కువగా టోర్నీల్లో పాల్గొనలేదు. తాజాగా జరిగిన ఈస్ట్బోర్న్ ఇంటర్నేషనల్ ఈవెంట్ తొలి రౌండ్లోనే సానియా జోడీ నిష్క్రమించింది. నెల వ్యవధిలో జరుగుతున్న వింబుల్డన్ 2021లో సత్తాచాటుతోంది. ఆపై ఒలింపిక్స్ 2021పై కూడా ఆమె దృష్టి సారించింది.