హైదరాబాద్: హైదరాబాదీ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా మరోసారి రాకెట్ పట్టుకోబోతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆమె టెన్నిస్ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి జరిగే టెన్నిస్ టోర్నమెంట్ లో ఆడటానికి సన్నద్ధమౌతున్నట్లు సమాచారం. ఓ బాబుకు జన్మనిచ్చిన అనంతరం సానియా.. తనకు అత్యంత ఇష్టమైన టెన్నిస్ కు దూరం అయ్యారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న ఆమె..
బాబుకు జన్మనిచ్చారు. రెండేళ్ల కిందట ఆమె చివరిసారిగా టెన్నిస్ టోర్నీలో పాల్గొన్నారు. అనంతరం గర్భం దాల్చడం వల్ల టెన్నిస్ కు తాత్కాలికంగా దూరం అయ్యారు. అదే సమయంలో- మోకాలి గాయం వల్ల కూడా రాకెట్ పట్టలేదు. గత ఏడాది అక్టోబర్ లో సానియా బాబుకు జన్మనిచ్చారు. కుమారుడి సంరక్షణ, కాన్పు తరువాత ఎదురయ్యే అనారోగ్య కారణాల వల్ల ఆమె గ్రౌండ్ లో అడుగు పెట్టలేదు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, మరో ఏడెనిమిది నెలల్లో రాకెట్ పట్టుకుంటానని సానియా సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.
కాన్పు తరువాత లావెక్కానని అన్నారు. బరువును తగ్గించుకోవడానికి ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నానని అన్నారు. టెన్నిస్ తన జీవితమని, దీన్ని ఇప్పట్లో వదులుకోబోనని ఆమె చెప్పారు. తల్లయిన తరువాత కూడా పలువురు క్రీడాకారిణులు టెన్నిస్ లో సంచలన విజయాలు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. స్టెఫీ గ్రాఫ్, సెరెనా విలియమ్స్.. వంటి క్రీడాకారిణులు తమ సెకెండ్ ఇన్నింగ్ లో కూడా టైటిళ్లు గెలిచారు. సానియా కూడా అదే బాటలో నడుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.