హైదరాబాద్: సానియా మిర్జా... భారత్లో ఈ పేరు తెలియని వారుండరు. పట్టుమని పదహారేళ్లైనా నిండకుండానే టెన్నిస్ ప్లేయర్గా స్టార్డమ్ సంపాదించుకుంది. టెన్నిస్లో మహిళా డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
భారత టెన్నిస్ క్రీడారంగంలో ఎంతో మందికి ఆమె ప్రేరణగా నిలిచారు. టెన్నిస్ స్టార్గా ఎదిగిన తర్వాత ఆమె తన కెరీర్ను నిలబెట్టుకోగలగడంతో పాటు దాయాది దేశమైన పాకిస్థాన్కు చెందిన క్రికెటర్ను పెళ్లి చేసుకుంది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎదురైన విమర్శలను తట్టుకొని నిలబడగలిగింది.

ఇలా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన జీవిత విశేషాలను తన అభిమానుల ముందు ఉంచేందుకు, తన విజయరహస్యాలను తెలియజేసేందుకు గాను రచయిత్రి అవతారమెత్తింది.
రాకెట్ను వదిలి పెన్ను పట్టుకుని ఈ విశేషాలన్నింటినీ సానియా మిర్జా బయోగ్రఫీ 'ఏస్ ఎగనెస్ట్ ఆడ్స్' లో అభిమానుల ముందు ఉంచేందుకు సిద్ధమైంది. సానియా మిర్జా రాస్తున్న ఆటో బయోగ్రఫీ 'ఏస్ ఎగనెస్ట్ ఆడ్స్'ను జులైలో విడుదల చేయనున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత పబ్లిషర్స్ హార్పర్ కొలిన్స్ బుధవారం వెల్లడించింది.
ఈ సందర్భంగా హార్పర్ కొలిన్స్ ఇండియా విభాగానికి చెందిన చీఫ్ ఎడిటర్ కార్తిక మాట్లాడుతూ, సానియా మిర్జా ఆటోబయోగ్రఫీని పబ్లిష్ చేసే అవకాశం తమకు లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఒక ప్రముఖ క్రీడాకారిణి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం తమకు గర్వకారణంగా కూడా ఉందన్నారు.
దాదాపు గుర్తెరిగినప్పటి నుంచి చేతిలో టెన్నిస్ రాకెట్ మాత్రమే పట్టుకున్న సానియా దాన్ని పక్కన పెట్టి మొదటిసారి పెన్ పట్టుకుని, తండ్రి ఇమ్రాన్ మిర్జా సహకారంతో ఆత్మకథ రాశారని అన్నారు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అడ్డంకులు, వాటిని అధిగమించిన తీరు, సాధించిన విజయాల వెనుక రహస్యాలు.. అన్నీ పుస్తకంలో రాసినట్లు, భవిష్యత్లో క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి ప్రేరణగా ఈ బుక్ రూపొందించామని చెప్పారు.
ఈ పుస్తకం ఆధారంగా సానియా జీవితంపై ఒక సినిమా తీసే ఆలోచనలో బాలీవుడ్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. కాగా 2012లో సానియా మిర్జా సింగిల్స్ విభాగం నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత డబుల్స్పైనే దృష్టి సారించి మహిళల డబుల్స్ ర్యాంకుల్లో వరల్డ్ నెంబర్ వన్గా నిలిచారు.