
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. గతేడాది ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సానియా మిర్జా కాస్త లావెక్కిన సంగతి తెలిసిందే. అయితే, డబుల్స్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన సానియా రోజు ఐదు గంటలపాటు జిమ్లో చెమటోడ్చారు.
ఫలితంగా నాలుగు నెలల కాలంలో ఏకంగా 26 కేజీల బరువు తగ్గి టెన్నిస్కు సరిపోయే క్రీడాకారిణిగా మారింది. 2017లో చైనా ఓపెన్ ఆడుతున్న సమయంలో మోకాలు గాయంతో ఆటకు దూరమైన సానియా ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఆటకు పూర్తిగా దూరమైంది.
తన కెరీర్లో ఆరు గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన సానియా ఒకానొక దశలో మహిళల డబుల్స్ నెంబర్ ర్యాంకుని కూడా సొంతం చేసుకుంది. తాజాగా ఫిట్నెస్ సాధించడంతో జనవరి 11 నుంచి జరిగే డబ్ల్యూటీఏ హోబర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో ఆమె పాల్గొనేందుకు సిద్ధమైంది.
మహిళల డబుల్స్లో నదియా కిచెనక్ (ఉక్రెయిన్)తో మిక్స్డ్లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ "నేను మళ్లీ రాకెట్ పట్టడానికి ప్రధాన కారణం... నేను టెన్నిస్ ఆడటం, గెలవటం, పోటీపడటం వీటన్నింటిని మిస్ అవుతున్నానన్న భావన నన్ను నన్నులా ఉండనివ్వడం లేదు" అని తెలిపారు.
"నిజం చెప్పాలంటే గత రెండేళ్లుగా నా కిట్ను పక్కన బెట్టేశాను. నేను అనుకున్న ఫలితాలు సాధించాననే తృప్తితో ఉన్నాను. అయితే అప్పుడే నాలో ఇంకా టెన్నిస్ ఆడే సత్తా మిగిలే ఉందని అనిపించింది. ఇలా అనిపించడం వల్లే మళ్లీ బరిలోకి రాగలుగుతున్నాను" అని సానియా మిర్జా వెల్లడించారు.