
దోహా: ఖతార్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా జోడీ నిష్క్రమించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సానియా మీర్జా (భారత్)-కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్) ద్వయం 4-6, 5-7 తేడాతో లారా సీజ్మండ్ (జర్మనీ)-కాగ్లా బైయుకాక్కే (టర్కీ) జంట చేతిలో ఓటమిపాలైంది. సానియా జోడి వరుస సెట్లలో పరాజయం పాలై ఖతార్ ఓపెన్ నుండి నిష్క్రమించింది.
గతవారం దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రీక్వార్టర్స్లో ఓడిపోయిన ఇండో-ఫ్రెంచ్ జోడీ.. ఖతార్లో తమ అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయింది. ఇక 2020 మార్చి 3 నుండి 7 వరకు దుబాయ్లో జరగనున్న ఫెడరేషన్ కప్లో ప్రాతినిధ్యం వహించడానికి సానియా మీర్జా సన్నద్ధమవుతోంది. చైనా నగరమైన డోంగ్గువాన్లో ఫిబ్రవరిలో ఈవెంట్ను నిర్వహింనుండే, కానీ కరోనా వైరస్ కారణంగా ఐటీఎఫ్ వేదికను మార్చింది.
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో కరోలినాతో కలిసి పాల్గొన్న సానియా రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో సానియా మీర్జా (భారత్)-కరోలినా గార్సియా (ఫ్రాన్స్) ద్వయం 4-6, 2-6తో సాయ్సాయ్ జెంగ్ (చైనా)-బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది.
2017 అక్టోబర్లో చైనా ఓపెన్ ఆడిన సానియా.. ఆ తర్వాత గాయపడటంతో ఆటకు విరామం ఇచ్చింది. ఇక 2018 అక్టోబర్లో మగబిడ్డ ఇజాన్కు జన్మనివ్వడంతో రెండేళ్లు ఆటకు దూరమైన సానియా.. రీ ఎంట్రీలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గి సత్తాచాటింది. ఈ టోర్నీ అనంతరం ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్క గాయంతో అర్థాంతరంగా తప్పుకుంది. అనంతరం రెండు వారాల్లోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుబాయ్ ఓపెన్ బరిలోకి దిగింది.