హైదరాబాద్: టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ మరోసారి విజేతగా నిలిచాడు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ తలపడ్డారు. వీరిద్దరూ ఇలా తలపడటం ఇది 36వ సారి కావడం విశేషం. అయితే 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ పైచేయి సాధించాడు. వరుస సెట్లలో 6-2, 6-3తో నాదల్పై ఫెదరర్ అలవోక విజయాన్ని సాధించాడు.
తొలి సెట్లో ఫెదరర్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు నాదల్. అయితే రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకున్నా మ్యాచ్ జేజారిపోయింది. నాదల్పై విజయం సాధించడంతో రోజర్ ఫెదరర్ సెమీస్కు దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం నాదల్ మీడియాతో మాట్లాడాడు.
'ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ఫెదరర్ చేతిలోఓటమి పాలయ్యాను. అది గెలవాల్సిన మ్యాచ్. ప్రస్తుతం ముగిసిన మ్యాచ్లో ఫెదరర్ నాకంటే చాలా బాగా ఆడాడు' అని నాదల్ పేర్కొన్నాడు. ఫెదరర్ సెమీస్లో కిర్గియోస్తో తలపడనున్నాడు.