ముంబై: బాంద్రాలోని ఇంటి నుంచి లియాండర్ పేస్ తనను బయటకు తోసేయాలని చూశాడని ఆయనతో సహజీవనం చేస్తున్న రియా పిళ్లై ఆరోపించారు. ఈ మేరకు ఆమె గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను లోనికి రానీయకుండా బయటకు గెంటేయాలని చూశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో శుక్రవారం వార్తలు వచ్చాయి.
గురువారం రాత్రి ఓ పెళ్లికి వెళ్లిన రియా పిళ్లై కూతురిని అక్కడే వదిలేసి ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి ముందు ఐదుగురు గుండాలు నిలబడి తనను ఇంట్లోకి అడుగు పెట్టనీయలేదని రియా ఆరోపించారు. హెల్ప్లైన్ ద్వారా ఆమె పోలీసులను పిలిచారు.
ఆ తర్వాత 45 నిమిషాలకు పోలీసులు వచ్చి, ఆమెను లోనికి పంపించారు. ఆమె ఇంట్లోకి వెళ్లేసరికి లియాండర్ ఆమెకు చెందిన అన్ని వస్తువులను ప్యాక్ చేశాడని రియా స్నేహితురాలు చెప్పినట్లు హిందుస్తాన్ టైమ్స్ రాసింది.
కొన్ని నెలల క్రితం కూడా ఈ విధమైన చర్యకే పేస్ ఒడిగట్టినట్లు రియా చెప్పారని ఆ మీడియా రాసింది. కూతురును తన కస్టడీకి అప్పగించాలని లియాండర్ పేస్ ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.