150 పాయింట్లు అందుకున్న రామ్కుమార్
దీంతో రామ్కుమార్ 150 పాయింట్లు అందుకొని తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే 20 ఏళ్ల తర్వాత ఏటీపీ సింగిల్స్ టైటిల్ నెగ్గిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. చివరగా భారత్ తరపున 1988లో లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీ సింగిల్స్లో విజేతగా నిలిచి ఏటీపీ టైటిల్ దక్కించుకున్నాడు.

తృటిలో టైటిల్ను కోల్పోయా
న్యూపోర్ట్ ఓపెన్ టోర్నీలో టైటిల్ చేజారినప్పటికీ, ఈ ప్రయత్నాన్ని ఓ గెలుపు పాఠంగా మలచుకుంటానని తెలపడం విశేషం. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ "ఫైనల్లో ఓటమి నిరాశ కలిగించింది. కానీ ఇక్కడివరకు రావడానికి చాలా కష్టపడ్డా. నేను తృటిలో టైటిల్ను కోల్పోయా. ఫైనల్ మ్యాచ్ను మరోసారి చూసి ఏమేం తప్పులు చేశానో తెలుసుకుంటా. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తా. ఇదో అనుభవపాఠంగా సద్వినియోగం చేసుకుంటాను. తుదిపోరుకు చేరడం ఆనందంగా ఉంది. ఈ క్షణాన్ని దేనితోనూ కొనలేం. ఈ మ్యాచ్ ఫలితం నుంచి సానుకూల విషయాలను మాత్రమే తీసుకుంటా. ఈ టోర్నీకంటే ముందు నేను ఆడిన నాలుగు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడాను. ఇప్పుడిలా ఫామ్లోకి రావడం ఆనందంగా ఉంది" అని అన్నాడు.

నా ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నా
"ఈ టోర్నమెంట్లో నా ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నా. ఇందుకోసం చాన్నాళ్ల నుంచే కష్టపడుతున్నాను. 12 ఏళ్ల వయసపుడు రోజు యోగ తరగతులకు వెళ్లేవాణ్ని. కొన్ని రోజుల తర్వాత వెళ్లడం మానేశా. మళ్లీ గతేడాది నుంచి యోగ, ధ్యానం చేయడం మొదలెట్టా. దాంతో నా ఆటలో చాలా మార్పు వచ్చింది. ఒత్తిడిని సమర్థంగా తట్టుకోగలుగుతున్నా. టోర్నమెంట్లలో ప్రతీ రౌండ్ను తాజాగా ప్రారంభించేందుకు, వంద శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నా. రెండో రౌండ్లోనే డెనిస్ కుడ్లాతో క్లిష్టమైన పోటీ ఎదురైంది. అయినా నింపాదిగా ఆడా. లియాండర్ పేస్, సంజయ్ సార్ నన్ను చాలా ప్రోత్సహించారు. తర్వాత స్టాండ్స్లో లియాండర్ పేస్ మ్యాచ్ను వీక్షిస్తూ ఇచ్చిన మద్దతు మరువలేను. మానసికంగా దృఢంగా ఉండేందుకు వాళ్లు సాయం చేశారు" అని రామ్కుమార్ తెలిపాడు.

ఆ గెలుపు నాలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది
"గత 15 నెలలుగా నేను నాలుగు ఏటీపీ చాలెంజర్ టూర్ ఈవెంట్లలో రన్నరప్గా నిలిచాను. దీంతో పాటు అంటాల్యా ఓపెన్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్ను కంగుతినిపించడం నాలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ టోర్నీలోనైనా, ఏ ప్రత్యర్థినైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్నిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నే కావొచ్చు. కానీ అదే సమయంలో ఆసియా క్రీడలు ఉన్నాయి. దీంతో దేశానికి ఆడటమే గొప్పగా భావించాను. అందుకే యూఎస్ నుంచి తప్పుకొని జకార్తాకే మొగ్గుచూపాను. ఇపుడు దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా" అని రామ్కుమార్ రామ్నాథన్ అన్నాడు.


Click it and Unblock the Notifications












