
స్పెయిన్: 20సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరుగనున్న వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2021, టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, మరికొన్నేళ్ల పాటు కెరీర్ను కొనసాగించడంపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు రఫా పేర్కొన్నాడు. తన టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు నాదల్ ఓ ట్వీట్ చేశాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాడు.
'అందరికీ హాయ్. ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఛాంపియన్షిప్, టోక్యో వేదిగా నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం ఏమీ కాదు. కానీ నా శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకొని నా బృందంతో చర్చించిన తర్వాత ఇదే సరైన నిర్ణయమని భావించా' అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ట్విటర్లో పేర్కొన్నాడు. నాదల్ 2008, 2010లో రెండుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు.
సుదీర్ఘకాలం కెరీర్ను కొనసాగించడం, అలాగే సంతోషాన్ని కలిగించే పనులను చేయడమే తన లక్ష్యమని రఫెల్ నాదల్ తెలిపాడు. వృత్తిపరమైన, వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం కోసం అత్యున్నతస్థాయిలో కష్టపడాలనుకుంటున్నట్లు స్పెయిన్ స్టార్ వివరించాడు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బ్రిటన్, జపాన్లోని తన అభిమానులకు ప్రత్యేక సందేశం పంపాలనుకుంటున్నానని రఫెల్ నాదల్ వరుస ట్వీట్లు చేశాడు.
ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సెమీ ఫైనల్స్లో సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ చేతిలో రఫెల్ నాదల్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. నాలుగు గంటల కుపైగా సాగిన ఈ హోరాహోరీగా పోరులో 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో జొకోవిచ్ అద్భుత విజయం సాధించాడు. దీంతో రొలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్)లో నాదల్ను రెండు సార్లు ఓడించిన ఏకైక ఆటగాడిగా జకో నిలిచాడు.