హైదరాబాద్: ఏటీపీ వరల్డ్ టెన్నిస్ ర్యాంకుల్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో నాదల్ 9,310 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానాన్ని స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (7,080) దక్కించుకున్నాడు.
ఇటీవల ముగిసిన వింబుల్డన్ సెమీఫైనల్లో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ చేతిలో రఫెల్ నాదల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం ఏటీపీ విడుదల చేసిన ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్ మినహా మిగిలిన టాప్ టెన్లోని ఆటగాళ్లు తమతమ స్థానాలను పదిలం చేసుకున్నారు.
ఆండర్సన్ ఆరో స్థానానికి పడిపోవడంతో, బల్గేరియా ఆటగాడు గ్రిగర్ డిమిత్రోవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. స్లొవాకియా ఆటగాడు మార్టిన్ క్లిజాన్ 35 స్థానాలు దిగజారి 77 ర్యాంకుకు పడిపోగా, వాషింగ్టన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినౌర్ 27 ర్యాంకులు అధిగమించి 45వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
తాజాగా ఏటీపీ విడుదల చేసిన టాప్-10 ర్యాంకుల్లో నాదల్ (స్పెయిన్, 9310 పాయింట్లు), రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్, 7080), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ, 5665), జాన్ మార్టిన్ డెల్ పొట్రో (అర్జెంటీనా, 5455), గ్రిగర్ డిమిత్రోవ్ (బల్గేరియా, 4610), కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా, 4355), మార్టిన్ సిలిక్ (క్రొయేషియా, 3905), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా, 3665), జాన్ ఇస్నెర్ (యూఎస్ఏ, 3490), నొవాక్ డెజోవిక్ (సెర్బియా, 3355) చోటు దక్కించుకున్నారు.