దోహా: మాజీ టెన్నిస్ నంబర్వన్, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్.. వచ్చే వారం జరగనున్న దుబాయ్ ఏటీపీ టోర్నమెంట్ నుంచి తప్పకున్నాడు. గాయం తర్వాత సరైన శిక్షణ కోసం టోర్నీ నుంచి తప్పుకున్నట్లు స్విస్ స్టార్ తెలిపాడు. మార్చి 22 నుంచి జరగనున్న మయామి టోర్నీలో పాల్గొనబోనని ఫెడరర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. 39 ఏళ్ల ఫెడరర్ ఇక వింబుల్డన్ టోర్నీపై దృష్టి పెట్టనున్నాడు. ఖతార్ ఓపెన్ 2021లో ఓడిపోయిన అనంతరం స్విస్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
'ఏటీపీ టూర్లోకి తిరిగి రావడం చాలా బాగుంది. దోహాలో ఆడుతున్న ప్రతి నిమిషం ఎంతో ఎంజాయ్ చేశా. నేను ఇక్కడి వరకు రావడానికి సహాయపడిన ఉత్తమ మరియు నమ్మకమైన బృందానికి పెద్ద ధన్యవాదాలు. ఇక శిక్షణకు తిరిగి వెళ్లడం ఉత్తమం అని నిర్ణయం తీసుకున్నా. అందుకే వచ్చేవారం జరగనున్న దుబాయ్ ఏటీపీ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నా' అని 20 సార్లు గ్రాండ్స్లామ్ టైటిల్ విజేత రోజర్ ఫెడరర్ ట్వీట్ చేశాడు.
రోజర్ ఫెడరర్ గత సంవత్సరం మోకాలి శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్లో నోవాక్ జొకోవిచ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయిన తరువాత ఖతార్ ఓపెన్ 2021లో మళ్లీ బరిలోకి దిగాడు. ఫెడరర్ దాదాపు 405 రోజులు తర్వాత కోర్టులోకి అడుగుపెట్టాడు. ఖతార్ ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లో ఫెదరర్కు బై లభించింది. ఇక రెండో రౌండ్లో 7-6 (10-8), 3-6, 7-5తో డాన్ ఎవాన్స్ (బ్రిటన్)పై ఫెడరర్ విజయం సాధించాడు.
క్వార్టర్ ఫైనల్లో ఈ స్విస్ దిగ్గజానికి భారీ షాక్ తగిలింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 1-6, 5-7తో 42వ ర్యాంకర్ నికోలోజ్ బసిలాష్యిలి (జార్జియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి సెట్ను సులువుగా నెగ్గిన ఫెడెక్స్ రెండో సెట్లో తేలిపోయాడు. ఇక హోరాహోరిగా సాగిన మూడో సెట్లో చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది.
India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. రోహిత్ ఔట్! సూర్యకుమార్కు షాక్!