గత కొంతకాలంగా అత్యుత్తమ ఆటతో నిలకడగా రాణిస్తూ వస్తున్న భారత యువ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదలైన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో ప్రజ్నేశ్ 75వ ర్యాంక్లో నిలిచాడు.
ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో టాప్-100లో చోటు దక్కించుకున్నాడు. అనంతరం రెండు ర్యాంక్లు మెరుగుపర్చుకుని 80కి చేరుకున్నాడు. తాజాగా కున్మింగ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో అద్భుతంగా రాణించడంతో మరో ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 75వ ర్యాంక్లో నిలిచాడు.
చైనాలో ఆదివారం ముగిసిన కున్మింగ్ ఓపెన్ టోర్నీలో ప్రజ్నేశ్ రన్నరప్గా నిలిచాడు. ఫైనల్లో ప్రజ్నేశ్ 4-6, 3-6తో జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. ఈ ప్రదర్శనతో ప్రజ్నేశ్ జూన్, జూలైలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగాల్లో నేరుగా మెయిన్ డ్రాలో అవకాశాన్ని పొందాడు.