
బాసెల్: పురుషుల టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్న ఏటీపీ (టెన్నిస్ ప్రొఫెషనల్స్ సంఘం), మహిళల పోటీలు నిర్వహిస్తున్న డబ్ల్యూటీఏ (మహిళల టెన్నిస్ సంఘం)లను విలీనం చేయాలని స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రతిపాదించాడు. ఈ మేరకు బుధవారం ఓ ట్వీట్లు చేశాడు. 'నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పురుషులు, మహిళల టెన్నిస్ను ఏకం చేయాలని నేనొక్కడినే ఆలోచిస్తున్నానా?' అని ఫెదరర్ తొలుత ట్వీట్ చేశాడు.
కాసేపటికే 20 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత రోజర్ ఫెదరర్ మరో ట్వీట్ చేసాడు. 'పోటీలను కలపాలని నేను మాట్లాడడం లేదు. పురుషుల, మహిళల పోటీలను నిర్వహించే రెండు పరిపాలన సంఘాలను విలీనం చేయాలని అంటున్నా' అని ఫెదరర్ ట్వీటాడు. మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత కారణంగా ప్రస్తుతం టెన్నిస్ పోటీలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ రద్దు కాగా.. ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్కు వాయిదా పడింది.
ఏటీపీ, డబ్ల్యూటీఏలను విలీనం చేయాలని ఫెదరర్ చేసిన ప్రతిపాదనకు టెన్నిస్ ప్లేయర్లు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ముందువరసలో ఉన్నాడు. మహిళా స్టార్లు సిమోనా హలెప్, పెట్రా క్విటోవా, గాబ్రిన్ ముగురుజలు స్విస్ టెన్నిస్ దిగ్గజం ఆలోచనను సమర్థించారు. మహిళా టెన్నిస్ దిగ్గజం బెల్లీ జీన్ కింగ్ కూడా ఫెదరర్కే మద్దతు తెలిపారు. అయితే ఆస్ట్రేలియా వివాదాస్పద యువ టెన్నిస్ ఆటగాడు నిక్ కైర్గియోస్ మాత్రం ఫెదరర్ ప్రతిపాదనను వ్యతిరేకించాడు.
ఫెదరర్ ప్రతిపాదనకు నాదల్ స్పందిస్తూ... 'నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు పురుషుల, మహిళల పరిపాలన సంఘాలను విలీనం చేయాలనడం గొప్ప ఆలోచన' అని ట్వీట్ చేశాడు. ఫెడ్ నిర్ణయం సరైందనుకున్న వారంతా మద్దతు తెలపాలని క్విటోవా పేర్కొంది. 1970 నుంచి తాను రెండు సంఘాల విలీనం గురించి చెబుతున్నానని దిగ్గజ ప్లేయర్ బెల్లీ జీన్ కింగ్ అన్నారు. నిక్ మాత్రం ఏటీపీ, డబ్ల్యూటీఏను విలీనం చేస్తే మనకెలా మంచి జరుగుతుందన్నాడు.