న్యూఢిల్లీ: టెన్నిస్ ఆటగాడు రోహన్ బొపన్నతో స్నేహం, ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న నమ్మకం, అవగాహనకు టెన్నిస్తో సంబంధం లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది మిక్స్డ్ డబుల్స్లో సానియా, బోపన్న కలిసి బరిలోకి దిగుతారన్న వార్తలు వస్తున్నాయి.
రియో ఒలింపిక్స్లో వీరి జోడీ పోటీపడుతుందని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే, సానియా ఈ విషయాన్ని వ్యతిరేకించలేదు. అలాగని ధృవీకరించలేదు. తాను 14 ఏళ్ల వయసులో తొలిసారి మిక్స్డ్ డబుల్స్ను బొపన్నతో కలిసే ఆడానని ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపిటిఎల్)లో ఆడుతున్న సానియా శనివారం మీడియా మాట్లాడుతూ చెప్పింది.
హామ్మన్ కప్ వంటి టోర్నీల్లోనూ ఇద్దరి కలిసి ఆడామని తెలిపింది. ఎనిమిది తొమ్మిదేళ్లపాటు తాము ఓటమి అనేది లేకుండా మిక్స్డ్ డబుల్స్లో విజయాలను నమోదు చేశామని తెలిపింది. తమ మధ్య మంచి అవగాహన ఉందని, ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసునని తెలిపింది. అందుకే బొపన్నతో మిక్స్డ్ డబుల్స్ ఆడటం తనకు ఎంతో సులభంగా ఉంటుందని పేర్కొంది.

తమ స్నేహం కేవలం టెన్నిస్కు మాత్రమే పరిమితం కాదని, కోర్టు వెలుపల కూడా బొపన్న తనకు మంచి స్నేహితుడిగా ఉంటాడని చెప్పింది. ఇద్దరికీ మిక్స్డ్ డబుల్స్లో అనేక చిరస్మరణీయ విజయాలను అందుకున్న జ్ఞాపకాలు ఉన్నాయని, భవిష్యత్తులోనూ అతనితో కలిసి ఆడటం తనకు సంతోషంగానే ఉంటుందని తెలిపింది.
ఆయితే, వచ్చే సీజన్లో అతనితో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడే విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోబోనని సానియా స్పష్టం చేసింది. కాగా, మీడియా సమావేశంలో ఆమె పక్కనే ఉన్న బోపన్న చాలా మౌనంగా ఉండిపోయాడు. సానియా చేసిన వ్యాఖ్యలపై స్పందించమని మీడియా కోరగా, ఆమె చెప్పిన ప్రతి మాటనూ తాను సమర్థిస్తున్నానని అన్నాడు.
ఒలింపిక్స్లో లియాండర్ పేస్తో కలిసి డబుల్స్ విభాగంలో ఆడతారా అన్న ప్రశ్నకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బొపన్న అన్నాడు. అయితే, వచ్చే సీజన్కు మాత్రం రుమేనియా క్రీడాకారుడు ఫ్లోరిన్ మెర్గియాతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.