సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఆదివారం సెంటర్ కోర్ట్ లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిర్గియోస్ ను 4-6, 6-3, 6-4, 7-6 (7-3) తేడాతో ఓడించాడు. తద్వారా జొకోవిచ్ వింబుల్డన్లో తన గుత్తాధిపత్యాన్ని చాటుకున్నాడు. రోజర్ ఫెదరర్, పీట్ సంప్రాస్, జార్న్ బోర్గ్ తర్వాత వింబుల్డన్లో వరుసగా నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పాడు. జకోవిచ్ 2018, 2019, 2021, 2022 వింబుల్డన్ టోర్నీల్లో వరుసగా ఛాంపియన్ గా నిలిచాడు. అతను మొత్తం ఏడు వింబుల్డన్ టైటిళ్లను పొందాడు. ఇక ప్రపంచ నంబర్ 3వ ర్యాంకర్ అయిన నొవాక్ జొకోవిచ్ ఈ ఫైనల్లో మొదటి సెట్ ను కోల్పోయాడు. అయితే వరుస సెట్లలో పుంజుకున్న అతను తర్వాత కిర్గియోస్ కు అవకాశం ఇవ్వలేదు. రెండో సెట్ నుంచి జోకోవిచ్ అనూహ్యంగా పుంజుకోవడంతో కిర్గియోస్ మళ్లీ తన ఫామ్ అందుకోలేకపోయాడు. ఇక చివరిసెట్లో గెలుపొందిన జొకోవిచ్ .. తన 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ముద్దాడాడు. ప్రస్తుతం రాఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్ కంటే ముందున్నాడు.