
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో పురుషుల సింగిల్స్లో టాప్సీడ్ నోవాక్ జకోవిచ్ (సెర్బియా) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అద్భుత ప్రదర్శనతో మెగా ఈవెంట్లో అతడు వరుసగా మూడో రౌండ్లోనూ విజయం సాధించాడు. శుక్రవారం రాత్రి జాన్ లెర్నడ్ (జర్మనీ)తో తలపడిన మ్యాచ్లో జకోవిచ్ 6-3, 6-3, 6-1తో సునాయాస విజయం అందుకున్నాడు. తన సర్వీసులతో లెర్నడ్ను కోలుకోనివ్వలేదు. రెండు సెట్లలో లెర్నడ్ కాస్త ఆకట్టుకున్నా.. మూడో సెట్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.
1 గంట 42 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. ఈ విజయంతో సింగిల్స్ విభాగంలో సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఇంకాస్త ముందుకు వెళ్లాడు. స్పెయిన్కు చెందిన పాబ్లో కారెనో బస్టాతో క్వార్టర్ ఫైనల్స్లో జాకో తలపడతాడు. తాజా విజయంతో జకోవిచ్ వరుసగా 29 మ్యాచ్లు గెలుపొందాడు. అలాగే ఈ సీజన్లో 26-0 విజయాలతో దూసుకుపోతున్నాడు. జకోవిచ్ ఇప్పటికే 2011, 2015, 2018లో మూడుసార్లు ఈ కప్పును అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక పురుషుల డబుల్స్ విభాగంలో ఇండో కెనడియన్ జోడీ.. రోహన్ బోపన్న, డెనిస్ షాపొవాలో రెండో రౌండ్కు చేరుకుంది. వీరిద్దరూ అమెరికన్ జోడీ ఎర్నెస్టో, రూబిన్పై విజయాన్ని అందుకున్నారు. 6-2, 6-4 తేడాతో విజయం సాధించారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో నంబర్ వన్ క్రీడాకారిణి అయిన జపాన్ స్టార్ నవోమి ఒసాకా నాలుగో రౌండ్కు చేరింది. శుక్రవారం ఉక్రెయిన్ స్టార్ మార్తా కోస్త్యుక్తో తలపడిన మూడో రౌండ్లో 6-3, 6-7 (4), 6-2 తేడాతో ఒసాకా విజయం సాధించింది.
ఏడేళ్ల నిరీక్షణకు తెరదించి గ్రాండ్స్లామ్ రెండో రౌండ్కు చేరిన భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ పోరు ముగిసిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్లో నాగల్ 3-6, 3-6, 2-6 తేడాతో మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో విజయం సాధించిన నాగల్.. రెండో రౌండ్లో కూడా పోరాడినా థీమ్ ముందు నిలువలేకపోయాడు.