బెల్గ్రేడ్ (సెర్బియా): సెర్బియా స్టార్, ప్రపంచ టెన్నిస్ నంబర్వన్ నోవాక్ జొకోవిచ్ తన సహృదయతను చాటుకున్నాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్పై పోరాడేందుకు తన వంతు సాయం ప్రకటించాడు. జొకోవిచ్ 1.1 మిలియన్ డాలర్ల (రూ.8.28 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు, శానిటరీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంత మొత్తాన్ని సెర్బియా ప్రభుత్వానికి విరాళం ఇచ్చినట్టు జొకో తెలిపాడు.
'భారత్లోనూ ఎక్కువ మంది నన్ను ప్రేమిస్తున్నారు.. పీఎస్ఎల్ బ్రాండ్వాల్యూ పెంచుతా'
కరోనా వైరస్ పంజా విసురుతుండడంతో దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఇక సెర్బియాలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మార్బెల్లాలో గడుపుతున్న జొకో.. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. 'కరోనా బారిన పడిన వారి జీవితాలను కాపాడే వెంటిలేటర్లు, సానిటరీ పరికరాల కోసం విరాళం ఇచ్చాను. సెర్బియాతో పాటు ప్రపంచంలో కరోనాతో బాధపడుతున్న వారికి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం, వైద్య నిపుణులు చెప్పిన సలహాలు పాటించి క్షేమంగా ఉండండి' అని కోరాడు.
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా మహమ్మారి కరోనా వైరస్పై పోరాడేందుకు తన వంతు సాయం ప్రకటించాడు. ఫెదరర్ రూ.7.75 కోట్లను విరాళంగా ప్రకటించాడు. స్విట్జర్లాండ్లో రోజురోజుకు కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో అక్కడి వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. తనను ఎంతో అభిమానించే ప్రజల రక్షణ కోసం ఫెదరర్ కూడా తన వంతు సాయం ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు ఫెదరర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అతడి ఏజెంట్.. కరోనా బాధితుల కోసం తమ హోటల్లో రెండు ఐసీయూ వార్డులు తీర్చిదిద్ది ప్రభుత్వానికి ఇచ్చారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కూడా తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా బాధితుల కోసం ఒక మిలియన్ యూరోలను విరాళంగా ప్రకటించాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.8.2 కోట్లు. ఈ డొనేషన్లో సగం బార్సీలోనా ఆసుపత్రులకు మిగతాది తన సొంత దేశం అర్జెంటీనాలో ఖర్చు చేయనున్నారు.