
హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సంచలనాల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ సిమోనా హలెప్ ఇంటి దారి పట్టగా.. తాజాగా రెండో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రెండో రౌండ్లో వోజ్నియాకి 4-6, 2-6 తేడాతో అన్సీడెడ్ సురెంకో (ఉక్రెయిన్) చేతిలో చిత్తుగా ఓడింది. సురెంకతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో వొజ్నియాకి మూడు డబుల్ ఫాల్ట్లతోపాటు 35 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. దీంతో టోర్నీలో టాప్ టు క్రీడాకారిణులు ఆరంభంలోనే నిష్క్రమించారు.
మరోవైపు మాజీ చాంపియన్ షరపోవా 6-2, 7-5తో సిర్స్టియా (రొమేనియా)పై, వింబుల్డన్ విజేత కెర్బర్ 6-2, 5-7, 6-4తో లార్సన్ (స్వీడన్)పై గెలిచి మూడోరౌండ్ చేరారు. మూడో సీడ్ స్టీఫెన్స్ (యుఎస్ఏ) నాలుగో రౌండ్ చేరింది. మూడో రౌండ్లో స్టీఫెన్స్ 6-3, 6-4తో అజరెంకా (బెలారస్)పై గెలిచింది. నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ), క్విటోవా (చెక్ రిపబ్లిక్) ముందంజ వేశారు.

ఇక, పురుషుల సింగిల్స్లో ఫెదరర్, జకోవిచ్ మూడో రౌండ్ చేరారు. రెండో రౌండ్లో రెండో సీడ్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 7-5, 6-4, 6-4తో పెయిర్ (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-3, 6-7 (2/7), 6-2తో సాండ్గ్రెన్ (అమెరికా)పై, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 6-4, 6-2తో మహుట్ (ఫ్రాన్స్)పై గెలుపొందారు.
మరో మ్యాచ్లో జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-3, 6-7 (2-7), 6-2తో సండకన్ (యుఎస్ఏ)పై గెలిచాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్ (భారత్)-సెరెటాని (అమెరికా) జంట 3-6, 4-6తో చార్డీ-మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో... జీవన్-ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) ద్వయం 3-6, 2-6తో కబాల్-ఫరా (కొలంబియా) జంట చేతిలో ఓడిపోయింది.