హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటమీద తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆమె ప్రస్తుతం ప్రయాణాలు చేయకూడదు. గర్భిణీ కారణంగా ఆసియా క్రీడలకు కూడా దూరమైన సానియా విచారం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను ఇంతకుముందు ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
'2002లో మొదటిసారిగా ఆసియా క్రీడలకు ఎంపికయ్యాను. భారత దేశానికి పతకాలు సాధించడానికి అవకాశమున్న క్రీడలవి. పతకాలతోనే ఆసియా కెరీర్ను ప్రారంభించాను. ఇప్పుడు అదే ఆటలకు దూరమైనందుకు కొంత విచారం వ్యక్తం చేస్తున్నా. ఆట ఆడాలనే వ్యామోహం నన్ను వదలడం లేదు. కానీ, నేను సాధించిన పతకాల ఫొటోలను చూసినప్పుడల్లా ఆ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాను.'
'నా జీవితంలో అత్యంత పెద్ద మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతూ ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను. అందుకోసమే నేను మీతో లేను. భారతీయ అథ్లెట్లందరికీ, ప్రత్యేకించి టెన్నిస్ క్రీడాకారులకు ఆల్ ది వెరీ బెస్ట్. మనదేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తారని ఆశిస్తున్నా' అంటూ భారతీయ అథ్లెట్లను ఉద్దేశించి పోస్ట్ చేసింది. గర్భిణీ ఉన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో చురుకుగానే కనిపిస్తోంది సానియా మీర్జా. ప్రత్యేక ఈవెంట్ ఉంటే తప్పనిసరిగా పోస్టులతో తన గుర్తింపును కాపాడుకుంటోంది.
ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా క్రీడలు శనివారం సాయంత్రం జరిగిన ఆరంభవేడుకతో మొదలైయ్యాయి. 45 దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో దిగనున్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. క్రీడాకారుల కోసం ఇండోనేషియా అన్ని ఏర్పాట్లు చేసింది.