హైదరాబాద్: తనకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన టెన్నిస్ క్రీడపై హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మియామి ఓపెన్ టోర్నీ ఫైనల్స్ ఓటమి అనంతరం మీడియాతో సానియా మిర్జా మీడియాతో మాట్లాడింది. గత 15 ఏళ్ళలో టెన్నిస్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నాయని సానియా పేర్కొంది.
దీంతో తాను టెన్నిస్కు పాతదాన్ని అయిపోయానని సానియా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది రెండో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. కాగా, సోమవారం ఉదయం జరిగిన మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్స్లో సానియా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ రన్నరప్గా నిలిచింది.
మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా-స్ట్రికోవా జంట 4-6, 3-6తో అన్సీడెడ్ ద్వయం గాబ్రియెలా దబ్రోవ్స్కీ (కెనడా)-జు యిఫాన్ (చైనా) జోడీ చేతిలో ఓటమిపాలైంది. గంటా 8 నిమిషాల పోరులో సానియా-స్ర్టికోవా జోడీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక మూల్యం చెల్లించుకుంది.
తొలిసారి వీరిద్దరూ ఆడిన తొలి టోర్నీలోనే దబ్రోవ్స్కీ-జు యిఫాన్ జోడీ టైటిల్ సాధించడం విశేషం. ఇక ఈ సీజన్లో సానియా-స్ట్రికోవా జోడీ ఫైనల్కు చేరడం ఇది రెండోసారి. సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నీలోనూ వీరిద్దరూ రన్నర్పగా నిలిచారు. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా క్రీడాకారిణి బెథానీ మాటెక్ సాండ్స్తో కలిసి సానియా బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది.
ఇక రన్నరప్గా నిలిచిన సానియా జోడీకి 1,87,970 డాలర్లు (రూ. కోటీ 22 లక్షలు), మియామి ఓపెన్ విజేతగా నిలిచిన దబ్రోవ్స్కీ-జు యిఫాన్ జోడీకి 2,85,170 డాలర్లు (రూ. కోటీ 85 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి.