హైదరాబాద్: మిక్స్డ్ డబుల్స్ అంటే పురుషుడు, మహిళ కలసి ఒక జట్టుగా అలాంటిదే వేరొక జట్టుపై ఆడతారు. కానీ, ఇక్కడ అమ్మాయిలను పక్కకు పెట్టేశారు. కేవలం ఇరుజట్లలోని మగాళ్లే ఆడుకుంటున్నారు. మీరే ఆడుకుంటే మాకేం పనిలేదా. అంటూ ఇరు జట్లలోని మహిళలు కోర్టు బయటకు ఒకరు వెళ్లిపోగా మరొకరు కోర్టులోనే కూర్చుండిపోయారు.
ఈ సరదా మ్యాచ్ జరిగింది ఏ ప్రాక్టీస్ సెషన్లోనో కాదు ఓ టోర్నీలో. ఇటీవలి కాలంలో జరిగిన హోప్మన్ టోర్నీలో భాగంగా మిక్స్డ్ డబుల్స్లో ఫెదరర్, బెలిస్ ద్వయం అమెరికాకు చెందిన జాక్ సాక్, కొకొ వాందెవాగేపై తలపడ్డారు. ఇందులో ఏం విశేషం ఉందనేగా మీ సందేహం.
Men will be men.... pic.twitter.com/13dsIh3PVS
— Rishi Bagree 🇮🇳 (@rishibagree) January 13, 2018
ఈ మ్యాచ్ తొలి సెట్ పూర్తయిన తర్వాత రెండో సెట్లో ఓ విచిత్రం జరిగింది. అటు.. ఇటు కోర్టుల్లో అమ్మాయిలను పట్టించుకోకుండా ఇద్దరు పురుష ఆటగాళ్లే ఒక గేమ్ అంతా ఆడేశారు. దీంతో ఒకానొక దశలో ఇద్దరు అమ్మాయిలు సరదాగా కాసేపు కోర్టులోనే కూర్చున్నారు. అప్పటికీ పాస్లు రాకపోవడంతో ఇద్దరూ కోర్టు బయటకు వెళ్లి బెంచీపై కూర్చొని వారి భాగస్వాముల ఆట వీక్షించారు.
ఈ ఘటనకు మైదానమంతా నవ్వుల పువ్వులు పూస్తున్నా ఆ మగ మహారాజులు మాత్రం అలాగే ఆడుతూ ఉన్నారు. ఆ గేమ్ ముగిశాక మళ్లీ అమ్మాయిలు కోర్టులోకి ప్రవేశించారు. బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై ట్విట్టర్లో 'మగాళ్లు ఎంతైనా మగాళ్లే కదా!' అంటూ రకరకాలుగా ట్వీట్లు వస్తున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.