మియామీ: ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కెరీర్లో అరుదైన మైలురాయిని చేరింది. ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో సబినే లిసికీని 7-6, 1-6, 6-3 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరింది. కాగా, ఆమె కెరీర్లో ఇది 700వ విజయం కావడం విశేషం.
ఇంతటి అరుదైన మైలురాయిని చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మ్యాచ్ ముగిసిన తర్వాత సెరీనా మీడియాకు తెలిపింది. పురుషుల సింగిల్స్లో బ్రిటిష్ ఆటగాడు ఆండీ ముర్రే బుధవారం కెరీర్లో 500వ (క్వింటుపుల్) విజయాన్ని నమోదు చేయగా, సెరెనా సెప్టుపుల్ సెంచరీ విజయాలతో సత్తా చాటింది. ఇలావుంటే, ముర్రే 3-6, 6-4, 6-1 తేడాతో డొమినిక్ థియెమ్ను ఓడించి సెమీ ఫైనల్ చేరాడు.
మలేసియా ఓపెన్ క్వార్టర్స్కు సైనా

కౌలాలంపూర్: భారత స్టార్, ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న మలేసియా సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. మిగతా భారత షట్లర్లంతా పరాజయాలను ఎదుర్కోగా, భారత్కు ఇప్పుడు ఆమె ఒక్కతే ఆశాకిరణమైంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఆమె చైనాకు చెందిన క్వాలిఫయర్ జూ యావోను 21-13, 21-9 తేడాతో చిత్తుచేసింది.
సైనా విజయాన్ని మినహాయిస్తే, గురువారం భారత్కు చేదు ఫలితాలు తప్పలేదు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంక్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అతనిపై చైనాకు చెందిన తియాన్ హౌవెయ్ 21-14, 21-18 తేడాతో విజయం సాధించాడు. 'టాప్-10' జాబితాలో స్థానం కోల్పోయి, ప్రస్తుతం 17వ స్థానంలో ఉన్న పారుపల్లి కశ్యప్ కూడా రెండో రౌండ్ ఓటమిపాలయ్యాడు. అతనిపై ప్రపంచ నంబర్ వన్ చెన్ లాంగ్ (చైనా) 21-10, 21-6 ఆధిక్యంతో సునాయాసంగా గెలిచాడు.
కాగా, ర్యాంకింగ్స్లో 17 నుంచి 14వ స్థానానికి చేరిన ప్రణయ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. లిన్ డాన్ (చైనా) 21-15, 21-14 స్కోరుతో ప్రణయ్ను ఓడించాడు. మహిళల డబుల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్ రజత పతకాన్ని సాధించిన జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ కూడా విఫలమైంది. రెండో రౌండ్లో వీరు 23-21, 8-21, 17-21 తేడాతో నిత్యా క్రిషిందా మహేశ్వరి, గ్రేసియా పొలీ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ పరాజయాలతో, సైనాను మినహా మిగతా భారతీయుల పోరటానికి తెరపడింది.