ముంబై: మరో 24గంటల్లో ఆరంభం కానున్న ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు టెన్నిస్ స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ ప్రకటించాడు. ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు ఆగష్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకూ జరగనున్నాయి. ఈ క్రమంలో అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన పేస్ తనకు జోడిగా బరిలోకి దిగేందుకు సుమిత్ నగల్తో ఆడాల్సి ఉంది.
కానీ, పేస్ నాణ్యమైన జోడి అయితే బాగుంటుందని మార్పు చేయాలని కోరాడు. ఇతనితో పాటుగా దివిజ్ శరణ్.. రోహన్ బోపన్నలు జోడిగా ఆడతామంటూ విజ్ఞప్తి చేశారు. వారికి మాత్రమే సమ్మతం తెలిపిన ఏఐటీఏ లియాండర్ పేస్ కోరికను నిరాకరించింది. దీంతో పేస్ కోరుకున్న డబుల్స్ భాగస్వామిని ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురై ఆసియా క్రీడల నుంచి వైదొలిగాడు 45 ఏళ్ల పేస్..
'ఆసియా క్రీడల్లో ఆడబోవట్లేదని భారమైన హృదయంతో చెబుతున్నా. బలమైన రెండో డబుల్స్ జోడీ కోసం జట్టులోకి డబుల్స్ స్పెషలిస్ట్ను తీసుకోవాలని చాలా వారాలుగా చెబుతున్నా లాభం లేకపోయింది' అని పేస్ అన్నాడు. దీంతో కోచ్ జీషన్ అలీ.. పేస్కు జోడీగా నగాల్ను ఆడించాలని నిర్ణయించాడు. ఐతే నగాల్ పేలవ ఫామ్లో ఉండడంతో లియాండర్ క్రీడల నుంచి తప్పుకున్నాడు.
'మా డబుల్స్ స్పెషలిస్ట్ అయిన శ్రీరామ్ బాలాజీ, విష్ణు వర్దన్, పూరవ్ రాజా, జీవన్ నెదున్చెజియాన్ ఈ సీజన్లో అద్భుతంగా రాణించి సక్సెస్తో తిరిగొస్తారని తెలిపాడు. ఇప్పుడు తాను తప్పుకోవడంతో.. తన స్థానంలో మరొకరు ఆడేందుకు అవకాశం కల్పించిన వాడినయ్యానని ముగించాడు. వాస్తవానికి పేస్ చెప్పిన పేర్లు భారత టెన్నిస్ టాప్ 5 ప్లేయర్లలో వాళ్లవి.