న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, రోహన్ బోపన్నలు తనపై చేస్తున్న విమర్శలు.. మరో దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్కు కోపం తెప్పించాయి. దీంతో తనను వ్యతిరేకించి, తనపై విమర్శలు గుప్పించే వారిపై ఎన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డాడు.
తనను రియో ఒలింపిక్స్ మిక్స్డ్ డబుల్స్లో సానియాతో కలిసి ఆడించకపోవడాన్ని తప్పుబడుతూ.. ఒలింపిక్స్కు మేటి జట్టును పంపలేదంటూ పేస్ విమర్శలు గుప్పించడం.. దీనిపై సానియా, బోపన్న ప్రతి విమర్శలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేస్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశఆడు.
'నా సుదీర్ఘ కెరీర్లో నా సహచర క్రీడాకారులు చాలామందికి విపరీతమైన అసూయ. 18 గ్రాండ్స్లామ్లు గెలవడానికి, 7 ఒలింపిక్స్లో పాల్గొనడానికి ఎంత కష్టపడాలో వారికి అర్థం కాదు. వారిలో కొందరు పది జన్మలు ఎత్తినా ఈ ఘనతలు సాధించలేరు. అందుకే కష్టపడి ఏదైనా సాధించడం మాని.. నా పేరు చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లు చేసే ప్రచారం వల్ల కొందరు నన్ను చెడ్డవాడిగా అనుకుంటున్నారు. మంచి పేరు సంపాదించడానికి జీవితకాలం పడుతుంది. కానీ కొందరు ఒక్క క్షణంలో దాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు' అని పేర్కొన్నాడు.

అంతేగాక, 'మొరిగేవాళ్లు మొరగనివ్వండి. నన్ను ద్వేషించే వాళ్ల గురించి నేను పట్టించుకోను. నా పేరును చరిత్ర పుస్తకాల్లో లిఖించుకుంటాను. జనాలు నమ్మినా నమ్మకపోయినా.. మీడియా వాళ్లు రాసినా రాయకున్నా.. తెలివైన వాళ్లు నా పేరును చరిత్ర పుస్తకాల్లో చూస్తారు' అని లియాండర్ పేస్ ఘాటు సమాధానమిచ్చాడు.
డబ్బు కోసమే ఆటలో కొనసాగుతున్నానని తనపై వచ్చే విమర్శలపై కూడా లియాండర్ స్పందించాడు. 'ఆటలో కొనసాగడం వల్ల నేను నష్టపోతున్నాను. నా కోచ్లకు, ప్రయాణాలకు కలిపి ఏడాదికి రూ.3 కోట్ల దాకా ఖర్చవుతాయి. సింగిల్స్తో పోలిస్తే ప్రైజ్మనీ తక్కువ. పైగా ఆ డబ్బు భాగస్వామితో పంచుకోవాలి. దీనికి తోడు అప్పుడప్పుడూ గాయాలైతే దానికి ఖర్చు పెట్టుకోవాలి. దీని బదులు ఆట వదిలేసి వ్యాఖ్యాతగా మారినా.. వక్తగా మారినా.. అకాడమీ నడిపినా బాగా డబ్బులు సంపాదించవచ్చు. నాకు ఆటంటే ఇష్టం కాబట్టే కొనసాగుతున్నా తప్ప ఇంకో కారణం వల్ల కాదు' అని పేస్ స్పష్టం చేశాడు.