
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ (46) వచ్చే ఏడాది కెరీర్కు వీడ్కోలు చెప్పనున్నారు. తన సుదీర్ఘ ప్రొఫెషనల్ కెరీర్కు 2020లోనే తెరదించుతానని పేస్ బుధవారం ప్రకటించారు. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా వచ్చే సంవత్సరమే నాకు చివరిది అని ఓ ప్రకటనలో పేస్ తెలిపారు. వచ్చే ఏడాది కొన్ని టోర్నీలను ఎంపిక చేసుకొని జట్టుతో ప్రయాణించి ప్రపంచంలోని తన అభిమానులతో వీడ్కోలు సంబురాలు చేసుకుంటానని పేర్కొన్నారు.
'2020 టెన్నిస్ కేలండర్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నా. వచ్చే ఏడాది ఎంపిక చేసుకున్న టోర్నీలలో మాత్రమే ఆడుతా. నా జట్టుతో ప్రయాణించి ప్రపంచంలోని నా స్నేహితులు, అభిమానులతో వీడ్కోలు సంబురాలు చేసుకుంటా' అని లియాండర్ పేస్ తెలిపారు. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా ఇద్దరు అక్కలు కూడా. కూతురు అలన, నాకు స్ఫూర్తి ఇచ్చిన అభిమానులకూ థ్యాంక్స్' అని పేస్ అన్నారు.
1991లోనే తన ప్రస్థానాన్ని ఆరంభించిన పేస్ ఇప్పటి వరకు 28 ఏళ్లకు పైగా టెన్నిస్ ఆట ఆడారు. ఈ సుదీర్ఘ కెరీర్లో 18 గ్రాండ్స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్లో కాంస్య పతకం, 55 కెరీర్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్నారు. 2016 ఫ్రెంచ్ ఓపెన్ పేస్ చివరి ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్. ఇటీవల 46 ఏళ్ల వయసులో డేవిస్ కప్లో 44వ విజయం సాధించి ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్లేయర్గా పేస్ చరిత్ర లిఖించారు. అయితే ఇటీవలి కాలంలో పేస్ ఆట ఏమాత్రం బాగాలేదు. దాంతో 19 ఏళ్లలో తొలిసారి అతడి ర్యాంక్ 100 కంటే దిగజారింది.
అంతర్జాతీయ టెన్నిస్లో 700కు పైగా విజయాలు సాధించిన కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ళలో పేస్ ఒకరు. 18 గ్రాండ్స్లామ్లు (8 పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్) గెలిచారు. వరుసగా 7 ఒలింపిక్స్లలో (1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016) పాల్గొన్న ఏకైక టెన్నిస్ ఆటగాడు మన పేస్. కెరీర్లో పేస్ ఇప్పటివరకు 55 టైటిల్స్ సాధించారు. ఇందులో సింగిల్స్లో ఒక టైటిల్ ఉండగా.. మిగతా 54 టైటిల్స్ డబుల్స్లో వచ్చాయి.
సింగిల్స్ విభాగంలో పేస్ 101 మ్యాచ్ల్లో గెలిచి.. 99 మ్యాచ్ల్లో ఓడిపోయారు. డబుల్స్లో 767 మ్యాచ్ల్లో విజయం సాధించి.. 455 మ్యాచ్ల్లో ఓటమిపాలయ్యారు. 1990లో జపాన్పై డేవిస్ కప్లో అరంగేట్రం చేసిన పేస్ 57 సార్లు డేవిస్ కప్ బరిలోకి దిగారు. 1999లో డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో పేస్ నిలిచారు.