చైనా వేదికగా జరుగుతున్న కున్మింగ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ అంకిత రైనాకు షాక్ తగిలింది. బుధవారం తొలి రౌండ్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ సమంత స్టోసుర్పై అద్భుతవిజయాన్ని అందుకున్న అంకిత.. గురువారం మాత్రం తేలిపోయింది.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అంకిత 6-1, 6-7 (2/7), 6-7 (7/9)తో చైనా క్రీడాకారిణి జాంగ్ కైలిన్ చేతిలో ఓడిపోయింది. 2 గంటల 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో అంకిత ఒత్తిడికి లోనై మ్యాచ్ చేజార్చుకుంది. మొదటి, రెండు సెట్లను తలోటి గెలిచారు. ఇక నిర్ణాయక మూడో సెట్లో అంకిత 5-1తో ఆధిక్యంలో నిలిచి సమయంలో జాంగ్ కైలిన్ ఒక్కసారిగా పుంజుకుని సెట్తో పాటు మ్యాచ్ గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో అంకిత 178వ స్థానంలో ఉండగా.. కైలిన్ 209వ ర్యాంకర్లో ఉంది.
టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మొదటి రౌండ్లో అంకిత 7-5, 2-6, 6-5 తేడాతో సమంత స్టోసర్(ఆస్ట్రేలియా)పై గెలిచింది. రెండు గంటల 50 నిమిషాల పాటు ఆ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి సెట్ గెలిచిన అంకిత.. రెండో సెట్ను ప్రత్యర్థికి అప్పగించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో జోరును కొనసాగిస్తూ.. సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది.