హైదరాబాద్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పైనల్లో 21-14, 21-13తో జపాన్ ఆటగాడు కెంటా నిషియోటాపై అలవోక విజయం సాధించాడు.
తొలి గేమ్ను 21-14తో గెలుచుకున్న శ్రీకాంత్ రెండో గేమ్లోనూ అదే జోరు కొనసాగించి 21- 13తో విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్లో నాలుగో టైటిల్ సాధించాడు. అంతేకాదు సూపర్ సిరీస్ టైటిల్స్ విజయాల్లో హ్యాట్రిక్ సాధించాడు.

అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్గా కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఘతన సాధించాడు. పైనల్లో జపాన్ ఆటగాడు కెంటా నిషియోటా ఏ దశలోనూ శ్రీకాంత్కి పోటీ ఇవ్వలేకపోయాడు. తాజా టైటిల్తో ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గిన నాలుగో పురుష షట్లర్గా శ్రీకాంత్ నిలిచాడు.
అంతకముందు లిన్ డాన్ (చైనా), లీ చాంగ్ వుయి (చైనీస్-మలేసియా), చెన్ లాంగ్ (చైనా) మాత్రమే ఈ ఘనత సాధించిన షట్లర్లు. ఈ టోర్నీలో సెమీస్లో భారత్కు చెందిన మరో షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్పై విజయం సాధించి ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే.
అంతకముందు గత వారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న శ్రీకాంత్కు పది రోజుల వ్యవధిలో ఇది మరో టైటిల్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ లో కూడా షట్లర్ కిదాంబి శ్రీకాంత్పై ప్రశంసల వర్షం కురిపించారు. గత వారంలో శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ 'డెన్మార్క్ ఓపెన్ సిరీస్ను కైవసం చేసుకున్న భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్కు నా అభినందనలు. భారతదేశం గర్వపడేలా చేశారు' అని పేర్కొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస
వరుసగా రెండు ప్రతిష్టాత్మకమైన టైటిళ్లను గెలిచిన కిదాంబి శ్రీకాంత్ దేశానికే గర్వకారణమయ్యాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన శ్రీకాంత్కు ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. శ్రీకాంత్ సాగిస్తున్న విజయ పరంపర దేశ క్రీడారంగానికే స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మరిన్ని విజయాలతో భవిష్యత్తులో శ్రీకాంత్ ప్రపంచంలో అత్యున్నత క్రీడాకారునిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.