హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్లోమాజీ ప్రపంచ నంబర్వన్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ప్లిస్కోవా 6-4, 6-4 తేడాతో ఇటీవలే యుఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన నవోమీ ఒసాకాపై అలవోక విజయాన్ని నమోదు చేసింది.
63 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఆద్యంతం ఆధిపత్యం వహిస్తూ ఒసాకా పది మ్యాచ్ల వరుస విజయాలకు కరోలినా ప్లిస్కోవా బ్రేక్ వేసింది. ఇటీవలే యుఎస్ ఓపెన్లో సెరెనాను ఓడించి గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్గా రికార్డు సృష్టించిన ఒసాకా, సొంతగడ్డపై ప్రత్యర్థి ప్లిస్కోవాకు దీటైన పోటీనివ్వడంలో విఫలమైంది.
తొలి సెట్లో కొంత దూకుడు కనబరిచినప్పటికీ అదే దూకుడుని ఆ తర్వాత కొనసాగించలేకపోయింది. పదునైన సర్వ్లకు తోడు బ్యాక్హ్యాండ్ షాట్లతో ప్లిస్కోవా 3-2 ఆధిక్యంలోకి వచ్చింది. ఇదే జోరులో తొలి సెట్ను దక్కించుకున్న ప్లిస్కోవా.. ఒసాకాకు ఏ మాత్రం అవకాశమివ్వలేదు.
పదునైన సర్వ్లు, వ్యాలీలతో ఒసాకాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో ఒత్తిడికి లోనైనా జపాన్ ప్లేయర్ అసహనంతో తన రాకెట్ను బూట్లకు కొట్టుకుంది. దీనికి తోడు ఒసాకా చేసిన తప్పిదాలు ప్లిస్కోవాకు బాగా కలిసొచ్చాయి. చిరకాల మిత్రుడు మిచెల్ను పెండ్లి చేసుకున్న తర్వాత ఈ చెక్ ప్లేయర్కు ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్గా 11వది.
రెండేళ్ల క్రితం ఇదే టోర్నీలో రన్నరప్గా నిలిచిన నవోమీ ఒసాకా తాజా టోర్నీలో సైతం భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి రన్నరప్తో సరిపెట్టుకుంది.