యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ క్లైమాక్స్కు చేరింది. టైటిల్ పోరులో బెలారస్ స్టార్ అర్యానా సబలెంక, అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులా అమీతుమి తేల్చుకోనుంది. గ్రాండ్స్లామ్ కెరీర్లో జెస్సికా తొలిసారి ఫైనల్స్కు అర్హత సాధించింది. ఇటీవల సెమీస్కు చేరి తన అత్యుత్తమ ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జెస్సికా సొంతగడ్డపై విజేతగా నిలవడానికి అడుగు దూరంలో నిలిచింది.
అయితే సెమీస్లో జెస్సికాకు గట్టిపోటీ ఎదురైంది. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ముచొవొ అంత తేలికగా ఓటమి అంగీకరించలేదు. కానీ అమెరికా అమ్మాయి ఆధిపత్యం చెలాయించి 1-6, 6-4, 6-2తో విజయం సాధించింది. తొలి సెట్లో తడబడినా ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. మొదటి సెట్లో ముచొవా దూకుడు చూస్తే జెస్సికా ఓటమి ఖాయమే అన్నట్లుగా కనిపించింది. అంతేగాక రెండో సెట్లో 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జెస్సికా గొప్ప పోరాట పటిమతో మ్యాచ్ను తనవైపు తిప్పుకుంది.

మరో సెమీఫైనల్లో ఎమ్మా నవారో (అమెరికా)ను రెండోసీడ్ సబలెంక 6-3, 7-6 (7-2)తో ఓడించింది. గాయంతో నవారో తీవ్ర పోటీనిచ్చినా విజేతగా నిలవలేకపోయింది. కాగా, యూఎస్ ఓపెన్లో సబలెంక ఫైనల్స్కు చేరడం వరుసగా ఇది రెండో సారి. గతేడాది కూడా టైటిల్ పోరుక అర్హత సాధించింది. కానీ రన్నరప్గా నిలిచింది. 2023, 2024లో సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. ఆదివారం తెల్లవారుజామున మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది.
ఇక మిక్స్డ్ డబుల్స్లో ఇటలీ జోడి సారా ఎరాని-ఆండ్రియా వవాసోరి విజేతగా నిలిచింది. ఫైనల్లో అమెరికా ద్వయం టేలర్ టౌన్సెండ్-డొనాల్డ్ యంగ్పై 7-6 (7-0), 7-5తో విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో సారా ఎరానికి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. గతంలో మహిళల డబుల్స్లో నెగ్గింది.