ముంబై: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్లో పతకం సాధించడం తన కల అని, ఒకవేళ అది జరక్కపోతే ప్రపంచ ముగింపు కాదంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా అన్నారు. మహిళల డబుల్స విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్న సానియా ఓ ఈవెంట్లో పైవిధంగా మాట్లాడారు.
'ఓ ఆశ, అవును. రియో ఒలింపిక్స్లో (సానియా, లియాండర్ పేస్) కలిసి మిక్సిడ్ డబుల్స్ విభాగంలో పతకం గెలవాలనేది ఆశ. అది జరక్కపోతే జీవితం అంతం కాదు. అంతేకాదు ప్రపంచ ముగింపు కాదు' అని ఆమె అన్నారు. దరాబాద్కు చెందిన ఈ టెన్నిస్ స్టార్ డేవిస్ కప్ స్టార్ రమేష్ కృష్ణన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా లియాండర్ పేస్తో జతకట్టి రియోలో ఒలింపిక్ పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది.

వరుసగా రెండో ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా నిలిచిన భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సింగపూర్ నుంచి నేరుగా మంగళవారం ముంబైకి చేరుకుంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న ఆమెకు క్రీడాభిమానులు ముంబై ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.
అనంతరం భారత్ పుట్బాల్ కెప్టెన్ సునీల్ చేత్రితో కలిసి తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నొప్పి నివారిణి 'వోలిని' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సింగపూర్లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీలో మార్టినా హింగిస్తో జతకట్టిన సానియా జోడీ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఒకప్పటి మాజీ వరల్డ్ నెంబర్ మార్టినా హింగిస్తో జతకట్టిన సానియా, ఈ ఏడాది ఏకంగా తొమ్మిది టైటిళ్లను గెలుచుకుంది. సానియా జోడికి ఇది వరుసగా 22వ విజయం. మొత్తంగా చూస్తే సానియా మిర్జా కెరీర్లో ఇది 32వ డబుల్స్ టైటిల్. సింగపూర్ జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్లో సానియా, మార్టినా హింగిస్ ఆటతీరుని చూసిన నవత్రిలోవా అద్భుతమైన ప్రదర్శన అంటూ ట్వీట్ చేశారు.