
ముంబై: ప్రపంచం నెంబర్వన్ టెన్నిస్ స్టార్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 13 సార్లు ఛాంపియన్ అయిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ను జకోవిచ్ చిత్తుగా ఓడించాడు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి రొలాండ్గారోస్లో జరిగిన మ్యాచ్లో జకోవిచ్ 3-6, 6-3, 7-6(7/4), 6-2 సెట్స్తో నాదల్ను జకో ఓడించాడు. గత 16 ఏళ్లలో (2005 నుంచి) క్లే కోర్టు గ్రాండ్ స్లామ్లో ఆడిన 108 మ్యాచ్లలో నాదల్కి ఇది మూడో ఓటమి కాగా.. 14 సెమీ ఫైనల్స్లో తొలి పరాజయం. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ను రెండుసార్లు ఓడించిన ఏకైక ప్లేయర్ జకోవిచ్ మాత్రమే.
ఓటమిపై రఫెల్ నాదల్ స్పందిస్తూ.. 'బెస్ట్ ప్లేయర్ గెలిచాడు' అని నొవాక్ జకోవిచ్పై పొగడ్తలు గుప్పించాడు. 34 ఏళ్ల సెర్బియన్ ప్లేయర్ జకోవిచ్ తన విక్టరీలలో ఇది గొప్పదని చెప్పుకొచ్చాడు. జకోవిచ్ ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో స్టెఫనోస్ సిట్సిపాస్తో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్కు చేరుకున్న మొట్టమొదటి గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన అతడు.. శుక్రవారం జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడి మూడున్నర గంటల హోరాహోరీ పోరు (6-3, 6-3, 4-6, 4-6, 6-3) తర్వాత విజయం సాధించాడు.
క్రీడాప్రముఖులు పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా నొవాక్ జకోవిచ్ను అభినందిస్తున్నారు. మరికొందరు రఫెల్ నాదల్ ఓటమిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆటగాళ్లు కూడా కొందరు రఫా-జకో పోరుపై స్పందించారు. భారత మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ హాస్యం జోడిస్తూ చేసిన ట్వీట్ నెటిజన్లను బాగా ఆకర్షించింది. 'ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో నాదల్ ఓడిపోయాడా?. ఇది పక్కాగా జోక్. ఓహ్ ఇట్ ఈజ్ ఏ డిజోక్' అని హాస్యస్పదంగా జాఫర్ ట్వీట్ చేశాడు. Djokovic పేరును D'joke' అంటూ అతడు సంబోధించాడు.
క్రీడల్లో పట్టువదలక పోరాడటం అంటే ఏంటో తెలియాలంటే ఈ మ్యాచ్ను చూడాలని టీమిండియా వెటరన్ ప్లేయర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఎవరైనా భారతీయులు రాత్రి ఈ మ్యాచ్ చూడకపోతే కనీసం రీప్లే అయినా చూడాలని కోరాడు. ఇలాంటి పోరు హైలైట్స్లో చూడటం కూడా సరిపోదని పేర్కొన్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ఇది కేవలం టెన్నిస్ కాదని, ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య జరిగిన అత్యున్నత ప్రదర్శన అని అశ్విన్ కొనియాడాడు. రఫా-జకో పోరుపై యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఓ ట్వీట్ చేశాడు.