న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ఢిల్లీ దశ టిక్కెట్ల ధరలను నిర్వాహకులు ప్రకటించారు. ఢిల్లీలో డిసెంబర్ 6 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. టికెట్ ధరలు రూ. 3,240 నుంచి రూ. 49,680 వరకు ఉన్నాయి.
ఈ టెన్నిస్ లీగ్లో అంతర్జాతీయ ఆటగాళ్లు చాలా మంది పాల్గొంటున్నారు. ఈ లీగ్లో రోజర్ ఫెదరర్ ఇండియన్ ఏసెస్ తరుపున ఆడనున్నాడు. కాబట్టి టెన్నిస్ అభిమానులు రూ. 3,240 చెల్లిస్తే రోజర్ ఫెదరర్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అన్నమాట.
ఇండియన్ ఏసెస్ జట్టులో సానియా మిర్జా, పీట్ సంప్రాస్, మోన్ ఫీల్స్, ఇవనోవిచ్, సాంటారో, రోహాన్ బోపన్న తదితరులు ఉన్నారు. భారత్ జరగనున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ కోసం డిసెంబర్ 6 నుంచి 8 వరకు భారత్లోనే రోజర్ ఫెదరర్ ఉంటాడు.

అంతక ముందు రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ నేను నమ్మలేకపోతున్నా. ఎప్పటినుంచో అనుకుంటున్నా ఇంతకాలానికి భారత్కు వెళ్లగలుగుతున్నా. సంస్కృతి, భాష పరంగా, ఆహార అలవాట్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నానని అన్నారు.
"భారతీయులతో మాట్లాడేటప్పుడు వారిలో తమ దేశం పట్ల ప్రేమను చూశా. చాలా గొప్పగా అనిపించింది. భారత్కు గొప్ప చరిత్ర ఉంది" అని రోజర్ ఫెదరర్ అన్నాడు. "భారత్లో ఆడడం నాకు ఓ గొప్ప గౌరవం. భారత్లో ఆడాలన్నిది నా కల. నా భారత పర్యటన ఒక్క టెన్నిస్ పరిమితం కాదని... అంతకు మించి" అని చెప్పారు.