
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మరోసారి వార్తల్లోకెక్కారు. గర్భం దాల్చినా సానియా మిర్జా అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగాను మాత్రం మానలేదు. గర్భధారణ సమయంలో కూడా యోగా చేసిన సానియా మిర్జా ఆశ్చరపరిచారు.
''అంతర్జాతీయ యోగా దినోత్సవం అయినా లేదా ఏ రోజైనా గర్భధారణ సమయంలోనూ నేను యోగా వీడలేదు. నా మార్గం యోగా'' అంటూ సానియా మిర్జా తాను యోగా చేస్తున్న ఫోటోతో సహా ట్విట్టర్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
దీనికి కేంద్ర మంత్రి మేనకగా గాంధీ ''వండర్ఫుల్ సానియా... గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల ఫిట్ గా ఉంటారు'' అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని మేనకా గాంధీ వ్యాఖ్యానించారు.
తాను కూడా తల్లులతో కలిసి యోగా చేస్తానని మేనకా గాంధీ ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన యోగా కార్యక్రమంలో కేంద్రమంత్రి మేనకా గాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే.