నాదల్, సిలిచ్ హోరా హోరీ పోరు
తొలి సెట్లో నాదల్, సిలిచ్ నువ్వా నేనా అన్నట్లు ఆడడంతో ఒక దశలో స్కోరు 3-3గా నిలిచింది. ఆ తర్వాతి సెట్ను సిలిచ్ 6-3తో చేజిక్కించుకున్నాడు. రెండో సెట్లో నాదల్ పుంజుకున్నాడు. వరుస పాయింట్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. సిలిచ్ డబుల్ఫాల్ట్ చేయడంతో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన నాదల్ ఆ తర్వాత 6-3తో సెట్ గెలిచాడు. 72 నిమిషాల పాటు సాగిన మూడో సెట్లో నాదల్, సిలిచ్ ప్రతి పాయింట్కు పోరాడటం ప్రేక్షుకలను ఎంతగానో ఆకట్టుకుంది. టైబ్రేకర్లోనూ స్కోరు 5-5తో సమంగా నిలిచింది. ఈ స్థితిలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన నాదల్ 7-6 (7-5)తో సెట్ గెలిచి మ్యాచ్లో ఆధిక్యం సాధించాడు.
ఫిజియోతో చికిత్స
అయితే నాలుగో సెట్లో 1-4 స్కోరుతో వెనకబడిన దశలో నాదల్ కుడికాలి పైభాగంలో నొప్పి కారణంగా తొలిసారిగా ఇంజ్యూరీ టైమ్ అవుట్ తీసుకున్నాడు. ఫిజియోతో చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి మ్యాచ్ను కొనసాగించాడు. అయితే 2-6తో ఆ సెట్ను ఓడాడు. మధ్య మధ్యలో విరామాలు తీసుకున్నాడు. ఐదో సెట్ రెండో గేమ్లో నాదల్ సర్వీసు బ్రేక్ చేసిన సిలిచ్ 2-0తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ స్థితిలో గాయం తీవ్రత ఎక్కువవడంతో నాదల్ పోటీ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఈ టోర్నీ మధ్యలో తప్పుకోవడం నాదల్కి ఇది రెండోసారి. గతంలో 2010లో నాదల్ గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్లోనే వైదొలిగిన సంగతి తెలిసిందే.
సంచలనం సృష్టించిన ఎలిస్ మెర్టెన్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలిసారిగా అడుగుపెట్టిన అన్సీడెడ్ క్రీడాకారిణి ఎలిస్ మెర్టెన్స్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్ 6-4, 6-0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్విటోలినా (ఉక్రెయిన్)ను వరుససెట్లలో చిత్తుగా ఓడించింది. గంట 13 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో 26 విన్నర్లు కొట్టిన మెర్టిన్స్ ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది. ఈ విజయంతో మెర్టెన్స్ తొలిసారి గ్రాండ్స్లామ్ సెమీఫైనల్లో ప్రవేశించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్లో వోజ్నియాకి 6-0, 6-7, 6-2తో స్పెయిన్కు చెందిన అన్సీడెడ్ స్వారెజ్ నవారోను ఓడించింది. సెమీస్లో మెర్టెన్స్తో వోజ్నియాకి అమీతుమీ తేల్చుకోనున్నారు.
దిమిత్రోవ్కు షాకిచ్చిన ఎడ్మండ్
బ్రిటన్కు చెందిన అన్సీడెడ్ ఎడ్మండ్ 6-4, 3-6, 6-3, 6-4 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్ గ్రిగోర్ దిమిత్రోవ్పై సంచలన విజయాన్ని నమోదుచేశాడు. టాప్-5 ఆటగాళ్లపై మ్యాచ్ నెగ్గడం ఎడ్మండ్కు ఇదే తొలిసారి. తన శక్తివంతమైన ఫోర్హ్యాండ్, సర్వ్లతో దిమిత్రోవ్పై ఒత్తిడి పెంచి తొలిసారిగా ఓ గ్రాండ్స్లామ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్లో సిలిచ్, ఎడ్మండ్ అమీతుమీ తేల్చుకోనున్నారు.
మిక్స్డ్ క్వార్టర్స్లో బోపన్న జోడీ
మిక్స్డ్ డబుల్స్లో భారత స్టార్ రోహన్ బోపన్న, హంగేరి అమ్మాయి బబోస్తో కలిసి క్వార్టర్ చేరాడు. ప్రిక్వార్టర్స్లో బోపన్న-బబోస్ 6-4, 6-4తో వానియా కింగ్ (అమెరికా)-ఫ్రాంకో స్కుగర్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించారు. బుధవారం జరిగే క్వార్టర్స్లో అన్సీడెడ్ సెబాస్టియన్ కాబల్-అబిగేల్ స్పియర్స్తో బోపన్న జోడీ తలపడనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో భారత్ తరుపున ఇక మిగిలున్న ఏకైక ఆటగాడు బోపన్నే. మిగతా భారత ఆటగాళ్లలో పేస్, పురవ్ రాజా, దివిజ్ ఇప్పటికే టోర్నీ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.