హైదరాబాద్: కాలిఫోర్నియా వేదికగా జరుగుతోన్న ఇండియన్ వెల్స్ మాస్టర్స్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన జోరుని ప్రదర్శిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్వన్ ఫెదరర్ 7-5, 6-1తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు.
దీంతో ఇండియన్ వెల్స్ టైటిల్ దిశగా రోజర్ ఫెదరర్ మరో ముందంజ వేశాడు. ఈ ఏడాది ఫెదరర్కిది వరుసగా 16వ విజయం కావడం విశేషం. 2006 తర్వాత ఈ ఫెదరర్ ఓ సీజన్ ఆరంభంలో 16 వరుస విజయాలు నమోదు చేయడం తొలిసారి కావడం గమనార్హం.
20 గ్రాండ్ స్లామ్లు గెలిచిన రోజర్ ఫెదరర్ సెమీఫైనల్లో కొరిక్ (క్రొయేషియా)తో ఆడనున్నాడు. ఇండియన్ వెల్స్ టైటిల్ను ఐదు సార్లు గెలిచిన రోజర్ ఫెదరర్ ప్రస్తుతం ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగాడు. ఏటీపీ 1000 ఈవెంట్లో ఫెదరర్ ఇప్పటివరకు ఒక సెట్ను కూడా డ్రాప్ చేయలేదు.
Eyes on the prize 👀
— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 16, 2018
In front of a packed house, Federer topples Chung 7-5 6-1 and secures a spot in the semifinals here for an 11th time. His next foe: Coric. #BNPPO18 pic.twitter.com/oh6YnKuce6
36 ఏళ్ల రోజర్ ఫెదరర్ ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ సెమీ ఫైనల్లో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)ను ఓడించడం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో కొరిక్ 2-6, 6-4, 7-6 (7/3)తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు.