ముంబై: సుదీర్ఘ విరామం అనంతరం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీతో కోర్టులో అడుగుపెట్టనున్నట్టు 33 ఏళ్ల హైదరాబాదీ స్టార్ ప్రకటించింది. వచ్చే ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో కూడా పాల్గొంటానని సానియా తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్లో నాదియా కిచనోక్ (ఉక్రెయిన్)తో, మిక్స్డ్ డబుల్స్లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి సానియా బరిలోకి దిగుతుంది.
క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపు.. ఉప్పల్ స్టేడియంలో అజరుద్దీన్ స్టాండ్!!
2017 అక్టోబర్ నుంచి సానియా ఆటకు దూరంగా ఉంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకున్న సానియా.. గతేడాది అక్టోబర్లో ఓ బాబుకు జన్మనిచ్చింది. సానియా కుమారుడి పేరు ఇజాన్. బాబుకు జన్మనిచ్చిన తర్వాత సానియా రెండేళ్లుగా టెన్నిస్ ఆటకు దూరంగా ఉంటోంది. సానియా చివరిగా 2017 అక్టోబరులో చైనా ఓపెన్లో ఆడింది.
సానియా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'జనవరిలో జరిగే హోబర్ట్ టోర్నీ ఆడుతున్నా. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్లో కూడా బరిలోకి దిగుతా. అంతకుముందే ముంబైలో జరిగే ఐటీఎఫ్ టోర్నీ ఆడాలనుంది. కానీ.. దానిపై ఇప్పుడే ఏం చెప్పలేను. నా మణికట్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆ టోర్నీలో ఆడే అవకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉన్నాయి' అని తెలిపింది.
'ఇజాన్ పుట్టాక నా శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారం, నిద్ర అన్ని మారిపోయాయి. జిమ్లో చాలా కష్టపడ్డా. ప్రస్తుతం నేను ఫిట్గా ఉన్నాననుకుంటున్నా. ఇజాన్ పుట్టడానికి ముందు నా శరీరం ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. ఆటకు సరైన ఫిట్నెస్ సంపాదించా' అని సానియా పేర్కొంది. మూడు నెలల క్రితం చికున్గున్యా వచ్చింది. రెండు వారాలు అనారోగ్యంతో బాధపడ్డా. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. పునరాగమనంలో సత్తాచాటగలనన్న విశ్వాసంతో ఉన్నా' అని సానియా చెప్పుకొచ్చింది.