
పాకిస్తాన్తో భారత్ ఢీ
డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ 1 పోరులో భాగంగా శుక్రవారం జరిగే సమరంలో పాకిస్తాన్తో భారత్ తలపడుతోంది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్లు, శనివారం డబుల్స్తో పాటు రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఏదైనా జట్టు 3-0తో ఆధిక్యం సాధించినా.. నాలుగో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఐదో మ్యాచ్ను మాత్రం ఆడకుండా తప్పుకునేందుకు రెండు జట్లకు వీలుంటుంది.

గెలిస్తే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత
వాస్తవానికి ఈ మ్యాచ్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగాలి. అయితే ఇరు దేశాల మధ్య సరైన సంబంధాలు లేని కారణంగా పాక్లో పర్యటించేందుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తిరస్కరించింది. ఎన్నో చర్చలు, తర్జభర్జనల తర్వాత మ్యాచ్ల వేదికను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇస్లామాబాద్ నుంచి కజకిస్థాన్కు మార్చింది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు మార్చి 2020లో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించి క్రొయేషియాతో తలపడుతుంది.

భారత్కు ఎదురుందా:
అనుభవజ్ఞులైన భారత ఆటగాళ్ల ముందు పాక్ జట్టు నిలువడం అసాధ్యమే. లియాండర్ పేస్, సుమీత్ నాగల్, రామ్కుమార్ రామనాథన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. మరోవైపు ఐసామ్ ఉల్ హక్ ఖురేషీ, అకీల్ఖాన్ దూరం కావడంతో పాక్ జట్టు మరింత బలహీనంగా మారింది. భారత ఆటగాళ్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో చెలరేగుతుంటే.. పాక్ ఆటగాళ్ల ప్రదర్శన ఐటీఎఫ్ ఫ్యూచర్స్ స్థాయి టోర్నీలకే పరిమితమవుతోంది. దీంతో పాక్పై భారత్ విజయం నల్లేరుపై నడకే అని చెప్పొచ్చు.

మైనస్ 15 డిగ్రీల చలి:
మ్యాచ్ జరిగే నూర్-సుల్తాన్లో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 15 డిగ్రీలకు చేరడంతో.. డేవిస్ కప్ మ్యాచ్ ఇండోర్ హార్డ్ కోర్టులో నిర్వహిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా వేడి హీటర్లు ఏర్పాటు చేశారు. బయటి వాతావరణం కూడా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో భారత్ పలు జాగ్రత్తలు తీసుకుంది. శీతల పరిస్థితుల్లో ఆడాల్సిన కారణంగా ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చినట్టు రాజ్పాల్ తెలిపాడు.

ఈ రోజు షెడ్యూల్:
# రామ్కుమార్ vs షోయబ్
# సుమీత్ నాగల్ vs అబ్దుల్ రహమాన్

ప్రధాన జట్లు
భారత్ : లియాండర్ పేస్, సుమీత్ నాగల్, రామ్కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని, జీవన్
పాకిస్థాన్ : అబ్దుల్ రహమాన్, మహమ్మద్ షోయబ్, యూసుఫ్ ఖలీల్


Click it and Unblock the Notifications












