డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-1లో భాగంగా స్వీడన్ జట్టుతో జరుగుతున్న పోరులో భారత టెన్నిస్ జట్టు ఓటములతో ఆరంభించింది. శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్ల్లోనూ ఓటమిపాలైంది. శ్రీరామ్ బాలాజి, రామ్కుమార్ రామనాథన్లు పరాజయాన్ని చవిచూశారు.
తొలి సింగిల్స్లో డబుల్స్ స్పెషలిస్ట్ అయిన బాలాజి ఓటమిపాలయ్యాడు. ఎలియాస్ ఎమర్ చేతిలో 6-4, 6-2తో ఓడిపోయాడు. అయితే బాలాజి ముందుగా ఈ పోరుకు సిద్ధం కాలేదు. భారత టాప్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ గాయంతో తప్పుకోవడంతో బాలాజి ఆడించాల్సి వచ్చింది. తొలి సెట్లో గట్టిపోటీనే ఇచ్చిన బాలాజి రెండో సెట్లో తేలిపోయాడు.

ఇక రెండో సింగిల్స్లో రామ్కుమార్ గెలిచి స్వీడన్ 1-0 ఆధిక్యాన్ని 1-1తో సమం చేస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. లియో బోర్గ్ చేతిలో రామ్కుమార్ 3-6, 3-6తో ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్ 0-2తో వెనుకంజలో నిలిచింది. స్వీడన్పై విజయం సాధించాలంటే ఇవాళ జరిగే డబుల్స్, రివర్స్ సింగిల్స్లో భారత్ తప్పక నెగ్గాలి.
స్వీడన్తో జరిగే పోరులో విజయం సాధిస్తేనే భారత్ వచ్చే ఏడాది క్వాలిఫయర్స్కు అర్హత సాధిస్తుంది. అయితే డేవిస్ కప్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే భారత్ 0-2తో వెనుకంజలో నిలిచి పుంజుకుని విజయం సాధించింది. 2010లో బ్రెజిల్పై, 2018లో చైనాపై తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలుపొందింది.
కాగా, డబుల్స్లో కెప్టెన్ రోహిత్ రాజ్పాల్.. బాలాజి, రామ్కుమార్లను ఆడిస్తాడా లేదా అన్నది చూడాలి. బాలాజి, నికి పూంచా జోడీగా దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వీడన్ చేతిలో భారత్ ఓడితే వచ్చే ఏడాది తిరిగి ప్రపంచ గ్రూప్ 1 ప్లేఆఫ్స్లో ఆడుతుంది.