జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ ఫ్రాంజ్ బెకర్కు చెందిన పతకాలు, ఇతర విలువైన వస్తువులు ఆన్లైన్ వేలంలో భారీ ధర పలికాయి. 83 ట్రోఫీలు, జ్ఞాపికలు కలిపి మొత్తం రూ. 5.90 కోట్లకు అమ్ముడైనట్టు వేలం నిర్వహించిన వేల్స్ హార్డీ కంపెనీ గురువారం తెలిపింది. 1989 యూఎస్ ఓపెన్లో బెకర్ సాధించిన ట్రోఫీ అత్యధికంగా రూ. 1.29 కోట్లకు అమ్ముడైంది. జూన్ 24 నుండి జూలై 11 వరకు ఆన్లైన్ వేలం జరిగింది. రెండేళ్ల క్రితం బెకర్ రూ. 3.43 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు కోర్టు ప్రకటించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కోట్లాది అప్పులను తీర్చలేక 2017లో బెకర్ దివాలా ప్రకటించారు. బెకర్కు సంబంధించిన పతకాల వేలం గత ఏడాదే జరగాల్సి ఉండే. తాను సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ తరఫున యూరోపియన్ యూనియన్కు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానని.. ఈ హోదా ఉన్నందున తన పతకాలను వేలం వేయడానికి వీల్లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే బెకర్కు అలాంటి నియామక పత్రాలు ఏవీ ఇవ్వలేదని సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ ఇటీవల ప్రకటించింది.
మరోవైపు 2014లో అదృశ్యమైన ఓ ఖాళీ పాస్పోర్టును బెకర్ ఫోర్జరీ చేశాడని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాడని కూడా ఆరోపించింది. ఈ వివాదంపై కోర్టు కేసు నడుస్తుండగా.. గతంలో పతకాల వేలానికి అనుమతి పొందిన వేలిస్ హార్డీ సంస్థ జూన్ 24న అధికారికంగా వేలం ప్రకటించింది.
బెకర్ ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మరియు ఒలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచాడు. 17 ఏళ్ళ వయసులో అత్యంత చిన్నవయసులో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఆటగాడుగా రికార్డుల్లో ఉన్నాడు. కెరీర్లో 49 టైటిళ్లు సాధించిన బెకర్ 2,27,89,100 డాలర్లు సంపాదించాడు. అయితే సహజీవనం, విచ్చలవిడిగా ఖర్చులు, కోర్టు కేసుల్లో ఇరుక్కుని డబ్బు పోగొట్టుకున్నాడు. ప్రస్తుత వేలం ద్వారా వచ్చే సొమ్ముతో అతని రుణాలను చెల్లించాల్సి ఉంటుంది.