ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులపై ఆస్ట్రియా స్టార్, 2018 రన్నరప్ డొమినిక్ థీమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.సెరెనా విలియమ్స్ వచ్చినంత మాత్రాన నా మీడియా సమావేశాన్ని మధ్యలోనే ముగించాలా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నాలుగో సీడ్ థీమ్ మూడో రౌండ్ గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రధాన మీడియా హాల్లో థీమ్.. తన ఆట గురించి విలేకర్లతో ముచ్చటిస్తున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అదే సమయంలో మూడో రౌండ్లో ఓడిపోయిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ కూడా మీడియా సమావేశం కోసం ఆ హాల్ దగ్గరకు వచ్చింది. 23 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా వేచి ఉండడంతో.. థీమ్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించుకొని వెళ్లాలని టోర్నీ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వెంటనే థీమ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సెరెనా విలియమ్స్ వస్తే.. నేను నా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాలా?. ఒక ఆటగాడికి ఇచ్చే మర్యాద ఇదేనా?' అని థీమ్ మండిపడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సెరెనా.. ప్రధాన హాల్ లేకపోయినా ఏదో గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. నిర్వాహకులు వేరే గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో సెరెనా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే పలువురు దిగ్గజాలు, మాజీలు థీమ్కు అండగా నిలబడ్డారు.