పారిస్: అంకితా రైనా.. గుజరాత్కు చెందిన టెన్నిస్ ప్లేయర్. పెద్దగా పరిచయం లేని పేరు. టెన్నిస్ అంటే ఇకపై తన పేరు గుర్తుకొచ్చేలా ఘన విజయాన్ని సాధించింది. ప్రఖ్యాత ఫ్రెంచ్ ఓపెన్ 2021 మెయిన్ డ్రాలో ఎంట్రీ ఇచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ 2021 క్వాలియఫయర్స్ (French Open 2021 Qualifiers) తొలిరోజే అద్బుతాన్ని సృష్టించింది. తొలి క్వాలిఫయర్స్ మ్యాచ్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాలో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నట్టే.
పారిస్లోని రోలండ్ గారోస్ సెకెండ్ స్టేడియంలో జరిగిన సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో అంకితా రైనా.. తన ప్రత్యర్థి, ఆస్ట్రేలియా వెటరన్ అరినా రొడినోవాను మట్టి కరిపించింది. 3-6 6-1 6-4 తేడాతో ఓడించింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన ఈ మ్యాచ్లో అంకిత రైనా తొలి సెట్లో తడబడింది. 3-6 తేడాతో తొలి సెట్ కోల్పోయింది. అయినప్పటికీ.. మొండి పట్టుదలను ప్రదర్శించింది. వరుస సెట్లలో ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని కనపరిచింది.
తొలి సెట్ను కోల్పోయిన అంకిత రైనా.. రెండో సెట్ను 6-1 తేడాతో గెలుచుకుందంటే.. ఆమె దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్లో అదే విజృంభణనను కొనసాగించింది. ఆ సెట్ను 6-4 తేడాతో గెలుచుకుంది. ఫస్ట్ సర్వ్-69 శాతం, సెకెండ్ సర్వ్-59 శాతం నమోదైంది. ఏడు బ్రేక్ పాయింట్లను అందుకుంది. అంతర్జాతీయంగా అంకిత రైనా ర్యాంక్ 182. ఇప్పటిదాకా తన కేరీర్లో క్వాలిఫయర్స్ మ్యాచ్లల్లో అత్యధిక విజయాలను అందుకున్నట్టయింది.
ఇదివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్ మ్యాచ్లల్లో ఆమె విజయం సాధించి.. గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాలో ఆడారు. అది ఆమె ఆడిన తొలి గ్రాండ్ స్లామ్. మూడో రౌండ్ దాకా వెళ్లి, వెనుదిరిగారు. ఈ సారి ఇక ఫ్రెంచ్ ఓపెన్ 2021 మెయిన్ డ్రాలో అడుగు పెట్టబోతోన్నారు. అంకిత రైనాతో పాటు సుమిత్ నంగల్, ప్రజ్నేష్ గున్నేశ్వరన్, రామ్కుమార్ రామనాథన్ ఈ క్వాలిఫయర్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తరువాతి మ్యాచ్లో సుమిత్ నంగల్.. ఇటాలియన్ ప్లేయర్ రోబెర్టో మార్కోరాను ఎదుర్కోవాల్సి ఉంది.