
హైదరాబాద్: రోలాండ్ గారోస్ టోర్నీలో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్, రష్యాకు చెందిన మరియా షరపోవా పోరుని వీక్షిద్దామనుకున్న టెన్నిస్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో భాగంగా సెరెనా విలియమ్స్, మారియా షరపోవాల మధ్య ఉత్కంఠగా సాగుతుందనుకున్న మ్యాచ్ జరగనేలేదు.
భుజ కండరాల గాయంతో మ్యాచ్కు ముందే అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో నాలుగో రౌండ్లో షరపోవా ఆడకుండానే క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మరియా షరపోవా... స్పెయిన్కు చెందిన ముగురుజా లేదా ఉక్రెయిన్కు చెందిన లెసియా సురెంకోల్లో ఒకరితో తలపడనుంది.
అనంతరం సెరెనా విలియమ్స్ మాట్లాడుతూ 'దురదృష్టవశాత్తు భుజ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నా. ఈ పరిస్థితుల్లో నేను ఆడలేను. ఇది చాలా కష్టంగా ఉంది. షరపోవాతో పోటీని ఎప్పుడు ఇష్టపడుతా. ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధేస్తుంది. నా కూతురు, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధన చేశాను. ఈ పరిస్థితి చాలా కఠినంగా ఉంది' అని పేర్కొంది.